అమరావతి : ఏపీ ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ను కొనసాగించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే మరో పక్క దీనిపై మాజీ మంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ సుప్రీం కోర్టులోను ఆశ్రయించారు. ప్రభుత్వ పిటిషన్ వేసినందున అయన కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. నిమ్మగడ్డ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించడంతోనే తాను ఈ పిటిషన్ వేసినట్టు ఆయన తెలిపారు. దీనిపై పార్టీ అధిష్టానం ఆమోదం మేరకు కేవియట్ పిటిషన్ వేసినట్టు ఆయన చెప్పడం గమనార్హం.
ఇంతకు ముందు అయన నిమ్మగడ్డను ఎస్ఈసీగా తొలగించడంపైనా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఆ పిటిషన్తో పాటు నిమ్మగడ్డ తదితరులు దాఖలు చేసిన పిటిషన్ ల విచారించిన హైకోర్టు ధర్మాసనం.. కనకరాజు నియామకం చెల్లదని తీర్పును ఇచ్చింది. అతని నియామకం కోసం ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆర్డినెన్స్ కూడా కొట్టివేసింది. ఇప్పుడు తాజాగా కామినేని సుప్రీం కోర్ట్ లో కేవియట్ పిటిషన్ దాఖలు చేయడం, పార్టీ అధిష్టానంతో చర్చించానని చెప్పడం ఇది రాజకీయ వర్గాలలో తీవ్ర ఆసక్తికరమైన అంశంగా మారింది. కాగా ఇదే కేసులో కాంగ్రెస్ నేత మస్తాన్ వాలీ కూడా సుప్రీం కోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. కామినేని, మస్తాన్ వలీ పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం విచారించనున్నది.