BJP Leader: “విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు. బీజేపీ ఏపీకి అన్యాయం చేయదు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీ బీజేపీ పోరాడుతుంది” – నిన్న సోము వీర్రాజు వ్యాఖ్యలు..!
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నవారు స్పిన్నింగ్ మిల్లులు, చక్కెర ఫ్యాక్టరీలు ప్రైవేటీకరణ అయినప్పుడు ఏం చేశారు. అప్పుడు ఆపగలిగారా..!? – నిన్న సోము వీర్రాజు వ్యాఖ్యలు..!
“ఎక్కడైనా ఏమైనా క్లారిటీ ఉందా”…!?
“అమరావతిలో ఉన్నవి అన్ని తాత్కాలిక భవనాలే. రూ 7200 కోట్లు నిధులతో ఒక్క శాశ్వత భవనం కూడా నిర్మించలేదు. రైతులను చంద్రబాబు నట్టేట ముంచేశాడు. అందుకే జగన్ రాజధాని మారుస్తా అంటున్నాడు – సోము వీర్రాజు (గతేడాది నవంబర్ 15న)
రాజధానిగా అమరావతి ఉండాలి. రైతులకు అన్యాయం జరగకూడదు. అక్కడ నిర్మించిన భవనాలు వృథా కాకూడదు. పరిపాలన అక్కడి నుండే జరగాలి – ఈ వ్యాఖ్యలు కూడా సోము వీర్రాజే (గతేడాది జులై 28న)
మూడు కాదు. రాష్ట్రంలో 13 రాజధానులు ఉండాలి. ప్రతీ జిల్లాని రాజధానిగా మార్చాలన్నదే బీజేపీ విధానం – ఈ మాటలు కూడా సోమువే (నవంబర్ 21న)
ఈ మాటల్లో ఏమైనా క్లారిటీ ఉందా..!? ఆ వైఖరి ఏమైనా అర్ధమవుతుందా..!?
ఇదే కాదు. ఏ అంశం ఇచ్చినా.. పోలవరం అవ్వనీ.., మూడు రాజధానులు అవ్వనీ.., విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ గొడవ అవ్వనీ.., స్థానిక ఎన్నికలు, నిమ్మగడ్డ .. ఇలా రాష్ట్రంలో ఏ రాజకీయ ఇష్యూ అయినా సోము వీర్రాజు మాటలు ఇలాగే ఉంటాయి. ఒకే వేదికపై భిన్నంగా మాట్లాడతారు. వేర్వేరు వేదికలపై ఒకేలా మాట్లాడతారు. వేర్వేరు వేదికలపై వెరైటీగా మాట్లాడతారు. ఆయన రూటే సెపరేటు. పోనీ సెపరేటు ఉన్నా పర్వాలేదు. జనాలకు, నాయకులకో, ఓటర్లకో దగ్గరయ్యేలా మాట్లాడితే బాగుండేది.. పార్టీకైనా ఉపయోగం ఉండేది.., కానీ సోము మాటలతో బీజేపీ మరింత అధః పాతాళానికి వెళ్తుందన్న విమర్శలు సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి.
BJP Leader: వ్యూహం మంచిదే.. కానీ మాట ముంచేది..!!
ఏపీలో బీజేపీ వ్యూహం మంచిదే.. రాష్ట్రంలో బలహీన పడుతున్న ప్రతిపక్షాన్ని మరింత బలహీనం చేసి.. ఆ స్థానాన్ని ఆక్రమించాలనే బీజేపీ రాజకీయ వ్యూహం ఒకే. కానీ దాని అమలుకు కావాల్సిన నాయకత్వ పటిమ, వాక్చాతుర్యం, మాస్ ఇమేజీ, అల్లుకుపోయి గుణం ఉన్న నాయకుడు ఒక్కరు కూడా లేరు. పోనీ ఉన్న వాళ్ళతో సర్దుకుపోయి వైహాన్ని అమలు చేద్దామంటే సోము వీర్రాజు మాటలతో స్పష్టంగా తెలిసిపోతుంది. ఆ పార్టీనే ఒక గందరగోళంలో ఉన్నట్టు అర్ధమవుతుంది. బీజేపీ బలంగా చెప్పుకోడానికి గత మూడేళ్ళలో ఏమి లేవు. “మేము ఇది ఇచ్చాము అని స్ట్రాంగ్ గా చెప్పుకునే ప్రాజెక్టులు, పథకాలు, ప్రత్యేకమైనవి ఏమి లేవు..! కానీ బీజేపీ రాష్ట్రానికి ఈ ఈ దెబ్బలు వేసింది అని చెప్పుకోడానికి కొన్ని ఉన్నాయి. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశం.., పోలవరానికి పూర్తిస్థాయిలో నిధులివ్వకుండా దాగుడు మూతలు ఆడుతున్న అంశం.. ఇలా చాలానే ఉన్నాయి. మొత్తానికి బీజేపీ తీరు చూస్తుంటే… ఒక స్పష్టమైన వ్యూహం ఉన్నప్పటికీ.., ఒక అస్పష్టమైన నాయకత్వంతో ఏమి చేయలేక.., ఏమి సాధించలేక.., కొన్నాళ్ళు ఓపిక పట్టేలా కనిపిస్తుంది. కానీ ఏపీ విషయంలో బీజేపీ మాత్రం ఒక పెద్ద తెరవెనుక వ్యూహాన్నే సిద్ధం చేసినట్టు అర్ధమవుతుంది..!!