రానున్న 2024 ఎన్నికల నాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ఆకాంక్షిస్తున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పదవుల పంపిణీలో తనదైన ఈక్వేషన్లు, స్ట్రేటజీతో ముందుకు సాగుతున్నది. బీజెపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ఇటీవల ప్రకటించిన కేంద్ర కార్యవర్గంలో రెండు తెలుగు రాష్ట్రాలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదన్న మాట వినిపిస్తుంది. జాతీయ అధికార ప్రతినిధులుగా ఉన్న ఏపికి చెందిన జీవీఎల్ నర్శింహరావు, తెలంగాణకు చెందిన మురళీధర్రావులకు తిరిగి చోటు లభించలేదు. అదే విధంగా తెలుగు రాష్ట్రాల బీజెపీ నేతలకు ఢిల్లీ స్థాయిలో సహాయ సహకారాలు అందించే సీనియర్ రాంమాధవ్కు జాతీయ కార్యవర్గంలో చోటు దక్కలేదు.
తెలంగాణలో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్కు ఓబిసి సెల్ జాతీయ అధ్యక్ష పదవి ఇవ్వడం, ఏపిలో మాజీ ఎంపి దగ్గుబాటి పురందీశ్వరికి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడం బీజేపీ వ్యూహాత్మక అడుగులో భాగమేనంటున్నారు. ఏపి రాష్ట్ర అధ్యక్షుడుగా సోము వీర్రాజు నియమితులు అయిన తరువాత రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గాన్ని, మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వర్గాన్ని పక్కన పెడుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దగ్గుబాటి పురందేశ్వరికి పదవి ఇవ్వడం వల్ల ఆ సామాజిక వర్గీయులను బీజేపీ పక్కన పెట్టడం లేదన్న భావన కల్గించడం ద్వారా ఇతర పార్టీల నుండి ఆ సామాజిక వర్గ నేతలను చేర్చుకునే వ్యూహమని అంటున్నారు. బీజెపీలో కొందరు నేతలు వైసీపీకి అనుకూలమని, కొందరు టీడీపీ అనుకూలమని ప్రచారం జరుగుతున్న వేళ ఆ పార్టీలకు సమదూరంగా దగ్గుబాటి పురందీశ్వరి వ్యవహరిస్తున్నారు.
జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ నర్శింహరావుకు రాబోయే కేంద్ర మంత్ర వర్గ విస్తరణలో చోటు లభించే అవకాశం ఉన్నందునే మళ్లీ ఆ పదవిలో ఆయనను కొనసాగించలేదనే వార్తలు వస్తున్నాయి. అదీను కాక జీవీఎల్కి పదవి ఇవ్వడం వల్ల సామాజిక వర్గ పరంగా బీజేపీకీ వచ్చే మైలేజీ ఏమీ ఉండదని భావించి పక్కన పెట్టారేమో అన్న మాట కూడా వినిపిస్తున్నది. ఏపి, తెలంగాణలో మంచి వాగ్దాటి ఉండి, టీవీ చర్చా వేదికలో అనర్గళంగా మాట్లాడే సత్తా ఉన్న బీజేపీ నేతలు ఉన్నప్పటికీ ఈ రెండు తెలుగు రాష్ట్రాల నుండి అధికార ప్రతినిధుల జాబితాలో ఒక్కరినీ ఎంపిక చేయకపోవడంపై ఆ పార్టీలో కొంత అసంతృప్తి ఉందంటున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?