BJP MIM దాదాపు 30 ఏళ్ల క్రితం వచ్చిన రామ్ గోపాల్ వర్మ గాయం సినిమాలో ఓ సన్నివేశం ఉంటుంది. పొలిటీషియన్ అయిన కోట శ్రీనివాసరావుకు నగరం ప్రశాంతంగా ఉండటం ఇష్టం ఉండదు. అందుకే హిందు, ముస్లింల మధ్య కావాలనే తగాదా సృష్టిస్తాడు. దాంతో అల్లకల్లోలం జరుగుతుంది. తమ రాజకీయ ఉనికి కోసమో.. సమస్యను సృష్టించి రాజకీయంగా పబ్బం గడుపుకునే రాజకీయ నాయకుల తీరును దాదాపు 30 ఏళ్ల క్రితమే చూపించారు ఆర్జీవీ. ప్రస్తుతం ఇదే తంతును నేటి రాజకీయ నాయకులు అవలంబిస్తున్నారు. అసలే మాత్రం చర్చల్లో, వార్తల్లో లోని అంశాన్ని సృష్టించి రాజకీయ ప్రకంపనలు, గందరగోళం సృష్టించిన ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీరు అలానే ఉంది. హైదరాబాద్ ను యూటీ చేస్తారేమో.. అని పార్లమెంట్ లో చేసిన ప్రకటన రాజకీయ గందరగోళానికి దారి తీసింది.
BJP MIM : ఒవైసీ కి హింట్ ఉందా..?
ప్రజలెప్పుడో మర్చిపోయిన మతపరమైన అంశాలను గత ఏడాది జరిగిన బీహార్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లోకి తీసుకొచ్చాయి బీజేపీ, ఎంఐఎం పార్టీలు. కొత్తగా ప్రజల్లోకి మతపరమైన అంశాలను జొప్పించి ఎవరికి వారు లాభపడ్డారు. ఇందులో సందేహం లేదు. బీహార్లో 5 సీట్లతో ఎంఐఎం లాభపడితే.. ఏకంగా అధికారంలో కూర్చుంది బీజేపీ. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీ, ఎంఐఎం ఇద్దరూ పుంజుకునేలా ఓట్లు, సీట్లు తెచ్చుకోవడంతో సఫలీకృతమయ్యారు. మళ్లీ ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్టున్నారు ఒవైసీ. ఏకంగా హైదరాబాద్ యూటీ అంటూ ఇందులోకి బెంగళూరు, చెన్నైను కూడా లాగారు. ఇప్పటికిప్పుడు దీని వల్ల ఒనగూరేది ఏమీ లేకపోయినా.. చిలికి చిలికి గాలివానగా మారేందుకు ఇదొక గాలి తుంపరగా చెప్పుకోవచ్చు. రాజకీయంగా వేడి.. పార్టీల నాయకుల వాడి వేడి మాటలతో విషయం రాజుకుంటుంది. రాజకీయ అస్థిరతకు అవకాశం ఏర్పడుతుంది. దీనిపై మొదట తామే చర్చించామని ప్రజల్లోకి వెళ్లేందుకు అవకాశం ఏర్పడుతుంది. అసలు కేంద్రం నుంచి ఎటువంటి హింట్ కూడా బయటకు రాకుండా ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేసారంటే.. ఏమో.. ఒవైసీ చీకట్లో బాణం వేస్తే బీజేపీకి తగిలిందేమో.. చెప్పలేం..!
దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం చూపు..
దీనిపై బీజేపీ వెంటనే స్పందించింది. అసలు కేంద్రానికి అటువంటి ఉద్దేశం లేకుడా ఒవైసీ ఇటువంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఒవైసీ వ్యాఖ్యలను ఖండించారు. నిజానికి దక్షిణాదిన ఉన్న బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాలు దేశానికి చాలా కీలకంగా మారాయి. ఆయా రాష్ట్రాల ఆర్ధికంగా పుంజుకోవడానికి.. విదేశీ పెట్టుబడులు ఆకర్షించడంలో ముందుంటున్నాయి. దీంతో కేంద్రం చూపు దక్షిణాది రాష్ట్రాలపై ఉందనేది వాస్తవం. ఆమధ్య హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధాని చేస్తారంటూ వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ నగరాలను కేంద్రం తన పరిధిలోకి తీసుకునేందుకు వెనుకాడదు అని కూడా చెప్పలేం. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో మమత కూడా దేశానికి నాలుగు రాజధానులు ఉండాలని ఓ బాంబ్ వేసి వదిలేశారు. ఇంకా దానిపై రాజకీయ రగడ మొదలుకాకపోయినా.. ఒక చర్చకు ఆస్కారమిచ్చారు. ఒవైసీ కూడా ఇలానే నర్మగర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారా అనేది కూడా ఆలోచించాల్సిందే. రాష్ట్ర విభజన సమయంలో.. ఓటుకు నోటు కేసు అనంతర పరిస్థిల్లో తప్ప హైదరాబాద్ యూటీ అంశం మళ్లీ తెర మీదకు రాలేదు.
అదే జరుగుతుందా..?
అయితే.. ఒవైసీ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు కలుగుతున్నాయి. ఇటివల దక్షిణాదిలో పాగా వేయాలని బీజేపీ భావిస్తోంది. అనూహ్యంగా తెలంగాణలో బీజేపీ ఎదుగుతోంది. నిజామాబాద్ ఎంపీ, దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ బాగా రాణించింది. హైదరాబాద్ లో బీజేపీ గాలి కాస్త బలంగానే ఉండి టీఆర్ఎస్ కోటకు బీటలు పడేలా చేసింది. బీజేపీ ఎదుగుదలను అడ్డుకునేందుకే ఈ అంశాన్ని తెర మీదకు తెచ్చారా అనే వాదనలూ లేకపోలేదు. సహజంగానే హైదారాబాద్ యూటీ అంటే కేసీఆర్ గానీ, కాంగ్రెస్ కానీ ఒప్పుకోరు. ప్రజల్లోకి వెళ్లి బీజేపీకి వ్యతిరేకంగా ఎవరికి వారు బీజేపీకి ఎదురుతిరిగేలా.. వారి ఇమేజ్ ను దెబ్బకొట్టేలా చేస్తారు. ఇలా జరగాలనే ఒవైసీ ఒక ప్లాన్ ప్రకారమే యూటీ అంశాన్ని తెర మీదకు తెచ్చారని కూడా చెప్పొచ్చు. అందుకే బీజేపీ అంత వేగంగా రెస్పాండ్ అయి.. ఒవైసీప వ్యాఖ్యల్ని కొట్టిపారేసింది. మరి.. ఒవైసీ నిజంగానే గురి చూసి కొట్టారో.. చీకట్లో బాణం వేశారో చూడాలి.