రాజమండ్రి, జనవరి 7: రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ బిజెపికి గుడ్బై చెబుతున్నారని సమాచారం. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షాను కలిసి అందజేయనున్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఆయన సతీమణి ఆకుల పద్మావతి జిల్లాలో జరిగే జనసేన కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. సంక్రాంతి పండుగ తరువాత ఆకుల తన అనుచరులతో కలిసి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
జనసేన తరపున ఆయన రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుండి బరిలోకి దిగాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తున్నది. ఆకుల సత్యనారాయణ భారతీయ జనతా పార్టీని వీడితే జిల్లాలోనే కాకుండా నవ్యాంధ్రలో ఆ పార్టీకి గట్టి షాక్గా భావించాల్సి ఉంటుంది. తన రాజీనామాపై వస్తున్న వార్తలకు ఆయన సోమవారం ఢిల్లీలో మీడియా ముందు వివరణ ఇచ్చారు. తాను ఇంత వరకూ బిజెపికి రాజీనామా చేయలేదని, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షాను కలిసేందుకు వచ్చిననీ ఆయన తెలిపారు. అమిత్షాను కలిసిన తరువాత తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని ఆకుల అన్నారు.