అమరావతి: ఎన్నికల ఫలితాల తర్వాత టిడిపి చీలిపోతుందని బిజెపి ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ జోస్యం చెప్పారు. నారా కుటుంబంపై నందమూరి కుటుంబం తిరుగుబాటు చేస్తుందనీ, దానితో పార్టీ రెండుగా చీలుతుందనీ ఆయన మంగళవారం మీడియా సమావేశంలో పేర్కొన్నారు.
జనసేనకు డబ్బులిచ్చి చంద్రబాబు ఆ పార్టీని రంగంలోకి దింపారనీ, కానీ జనసేన వల్ల వైసిపి లాభపడిందనీ మాధవ్ అన్నారు. వైసిపి గెలిస్తే ఆ పార్టీ నాయకులు అందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పాలని ఆయన వ్యాఖ్యానించారు. లగడపాటి సర్వే టిడిపి సొంత సర్వే తప్ప మరోటి కాదని ఆయన అన్నారు.
దేశంలో మళ్లీ నరేంద్ర మోదీ ఖాయంగా అధికారంలోకి వస్తారనీ, రాష్ట్రంలో గెలవలేని చంద్రబాబు జాతీయస్థాయిలో ఉనికి కోసం తాపత్రయపడుతున్నారనీ మాధవ్ పేర్కొన్నారు.