మూడు దశాబ్దాల క్రితం రాజకీయాల్లో స్వామీజీలు ఉంటే ఎన్నో విమర్శలు వచ్చేవి. ఇందుకు ఉదాహరణగా చంద్రస్వామి నిలుస్తారు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో చంద్రస్వామి కాంగ్రెస్ లో కేంద్ర మంత్రిగా పని చేశారు. అప్పట్లో ఎన్నో విమర్శలు, సినిమాల్లో కల్పిత పాత్రలు, వ్యంగ్యాస్త్రాలు.. ఇలా అన్నీ చంద్రస్వామిని ఉదహరించే చూపించారు. కానీ.. అదే స్వామీజీలు ఇప్పుడు రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. ముఖ్యమైన పదవులు కాదు.. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రులు అవుతున్నారు. బీజేపీ కల్పించిన అవకాశంతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న యోగి ఆదిత్యనాధ్ ఇందుకు ఉదాహరణ. గోరఖ్ పూర్ ఆశ్రమ అధిపతి అయిన యోగి ప్రస్తుతం బీజేపీలో కీలక వ్యక్తి. ఆర్ఎస్ఎస్ భావజాలం ఉండటం కలిసొచ్చింది. ఇప్పుడు ఇదే స్ట్రాటజీని బీజేపీ మరోసారి ప్రయోగించబోతోంది.
మతం అంశమే బీజేపీ ఎజెండానా..?
దేశంలో బీజేపీ హవా అప్రతిహతంగా కొనసాగుతోంది. తమది హిందూత్వ పార్టీ కాదు.. అంటూనే అదే ముద్రను వెనకుండి వేస్తోంది. రీసెంట్ గా బీహార్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మతం అంశాన్ని ప్రధానంగా తీసుకుని ఫలితాల్ని పొందింది. హిందువులను ఆకట్టుకుంటూ ఓట్లు సాధిస్తూ తనదైన ముద్ర వేస్తోంది. దీనినే ఇప్పుడు తిరుపతి ఎంపీ ఉప ఎన్నికలో ప్రయోగించేందుకు విత్తనాలు కూడా వేసేసింది. ‘భగవద్గీతకు ఓటేస్తారా.. బైబిల్ కు ఓటేస్తారా’ అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇటివల తిరుపతిలో ఓ మాట వదిలేసి వెళ్లారు. ఇప్పుడు ఇదే మతం అంశాన్ని త్వరలో జరగబోయే బెంగాల్ ఎన్నికల్లో ప్రయోగించబోతోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా, హోరాహోరీగా జరుగుతాయని భావిస్తున్న బెంగాల్లో పట్టు కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. బీజేపీ నుంచి బెంగాల్ సీఎం అభ్యర్ధిగా ‘కృపాకరానంద మహారాజ్’ పేరును దాదాపు ఖరారు చేసిందని సమాచారం.
సీఎంగా బీజేపీ నుంచి మరో స్వామీజీ..!
వేలూర్ రామకృష్ణ మఠంలోని ఆరోగ్య విభాగాధిపతిగా ఆయన ఉన్నారు. ఆయన అసలు పేరు డెబాతోష్ చక్రవర్తి. మెడికల్ ఎంట్రన్స్ లో టాపర్, ఎన్ఆర్ఎస్ కాలేజీలో మెడిసిన్, ఎయిమ్స్ లో ఎంఎస్, అమెరికాలో కార్డియాలజీలో ప్రత్యేక కోర్సు చేసిన ఉన్నత విద్యావంతుడు. తమ భావజాలానికి అత్యంత దగ్గరగా ఉండటంతో బీజేపీ కృపాకరానంద వైపే మొగ్గు చూపుతోందని తెలుస్తోంది. ఆర్ఎస్ఎస్ కూడా స్వామీజీ పైనే గురిగా ఉందని అంటున్నారు. ఎన్నికలకు ముందే ప్రధాని, ముఖ్యమంత్రి అభ్యర్ధులను ప్రకటించి ఎన్నికలకు వెళ్లే బీజేపీ బెంగాల్లో కూడా కృపాకరానందను ముందుంచే ప్రచారం మొదలుపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే.. రాజకీయంగా తనపై వస్తున్న వార్తలను గతంలో కొట్టేపారేశారు స్వామీ కృపాకరానంద. తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని ప్రకటించారు. కానీ.. బీజేపీ ఆయన్ను ఒప్పిస్తోందని అంటున్నారు. బెంగాల్లో మమతను ఢీ కొట్టాలంటే బీజేపీ సాదాసీదాగా వెళ్తే సరిపోదు. ప్రతి అశంలోనూ కేంద్రాన్ని ఢీకొట్టే మమతను అధికారానికి దూరం చేయాలనేది బీజేపీ ప్లాన్. అందుకు వేస్తున్న అడుగులే ఇవి. మరోవైపు ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపి తృణమూల్ నుంచి భారీగా వలసలను కూడా ప్రోత్సహిస్తోంది. మమతకు అత్యంత నమ్మకస్థుడిగా పేరున్న సుబేంధు అధికారిని బీజేపీ తనవైపుకు తిప్పుకోవడం ఇందులో భాగమే.
దీదీ అడుగులు కూడా గట్టిగానే..
మరోవైపు తృణమూల్ నుంచి బీజేపీలోకి వలసలు జరగడం మమతకు మింగుడుపడటం లేదు. తనకు నమ్మకస్థుడిగా ఉండి ఇటివలే బీజేపీలో చేరిన సుబేంధు అధికారికి, బీజేపీకి ఝలక్ ఇచ్చేందుకు మమత ఈ సోమవారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను రెండుసార్లు గెలిచిన భవానీ నగర్ నుంచి ఈసారి పోటీ చేయట్లేదని.. తాను అధికారంలోకి రావడానికి, తన పోరాటానికి ఫలితాన్నిచ్చిన నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. బీజేపీ నుంచి సుబేంధు అధికారి ఇక్కడి నుంచే పోటీ చేస్తారనే ఊహాగానాలు వస్తూండటంతో మమత ఈ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీని, సుబేంధు అధికారిని దెబ్బ కొట్టేందుకు మమత ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేయాలని భావిస్తోందని తెలిసిన విషయమే. అయితే.. బీజేపీకి అన్ని రాష్ట్రాలు వేరు.. బెంగాల్ వేరు. మమత స్థాయిలో బీజేపీకి, మోదీ, అమిత్ షాకు ఎదరు నిలిచే నాయకులు లేరు. అందుకే కొరకరాని కొయ్యగా మారిన బెంగాల్ లో బీజేపీ జెండా పాతాలనేది కమలనాధుల ప్రయత్నం. మరి.. దీదీ వర్సెస్ బీజేపీలో ఎవరిది పైచేయిగా నిలుస్తుందో తెలియాలంటే మరో నాలుగు నెలలు ఆగాల్సిందే.