AP BJP : నేను గానీ లేచానంటేనా..! అని ముదిమి వయసులో ఉన్న ఓ వ్యక్తి అన్నాడని సామెత. ప్రస్తుతం ఏపీ బీజేపీ పరిస్థితి ఇదే. అలా అని బీజేపీలో సత్తా లేదా.. అంటే ఉంది. జాతీయపార్టీగానే కాదు.. ఒకప్పుడు దేశం మొత్తం మీద రెండు స్థానాలే సంపాదించిన పార్టీ.. ఇప్పుడు కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారం చేపట్టింది. దేశాన్ని శాసిస్తోంది. ప్రపంచంలోనే ప్రధాని మోదీ పేరు మోగిపోతోంది. దక్షిణాదిలో కర్ణాటకలో మాత్రమే బలంగా ఉంది. తెలంగాణలో ఇప్పుడిప్పుడే బలపడుతోంది. మిగిలిన మూడు రాష్ట్రాల్లో సత్తా చాటేందుకు తిప్పలు పడుతోంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. మేం తలచుకుంటే.. అని ఏపీలో అంటోందే కానీ.. అడుగడుగునా అడ్డంకులే. ప్రస్తుతం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం ఏపీ బీజేపీ మెడకు చుట్టుకుంటోంది. దీనిపై ఎలా మాట్లాడాలో సలహాలు తీసుకుందామన్నా ఏపీ బీజేపీకి కేంద్ర పెద్దల అపాయింట్ కూడా దొరకలేదని తెలుస్తోంది.
AP BJP : ఏపీ అంటే అలుసేనా..?
తెలంగాణలో మాదిరిగానే ఏపీలో కూడా సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది బీజేపీ. కన్నా నుంచి సోము వీర్రాజుకు పగ్గాలు అప్పజెప్పింది. మొదట్లో తన దూకుడుతో మెరుపులు మెరిపించిన సోముకు అధిష్టానం బ్రేకులు వేసే ఆచితూచి స్పందించేలా చేసింది. దుబ్బాక ఫలితాల్లా తిరుపతి ఉప ఎన్నికలో సత్తా చాటాలని ఏపీ బీజేపీ మిత్రపక్షమైన జనసేనను వదిలేసి గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసేసింది. తమ అభ్యర్ధే ఉంటాడని చెప్తూనే.. పవన్ తో కలసి వెళ్తామని అన్నారు. ఎప్పుడైతే ‘ఏపీ బీజేపీ నుంచి తగిన సహకారం అందట్లేదు’ అని పవన్ కల్యాణ్ అన్నారో పరిస్థితిలో మార్పు వచ్చింది. అధిష్టానమే ఆదేశించిందో.. మొట్టికాయలే వేసిందో కానీ.. తెల్లారేసరికి పవన్ ఇంట్లో తేలారు సోము వీర్రాజు. ఇలా ప్రతి అంశంలో సోము వీర్రాజుకు చెక్ పడుతుంటే.. ఇప్పుడు విశాఖ ఉక్కు.. ఏం మాట్లాడాలో.. ఏం చేయాలో తెలీనీకుండా చేసేసింది. నిన్న, ఈరోజు మీడియా, సోషల్ మీడియాలో కూడా ఏపీ బీజేపీ అమిత్ షా అపాయింట్ మెంట్ ఇవ్వలేదనే వార్త ప్రధానాంశంగా మారింది. ఈ వార్త నిజమే అయితే.. ఏపీ బీజేపీని కట్టగట్టి గంగలో పడేయాల్సిందే. అసలు అమిత్ షాకు ఆంధ్రప్రదేశ్ అంటే లెక్కుందో లేదో కూడా ఏపీ బీజేపీ నాయకులకే తెలియాలి.
అమిత్ షా అపాయింట్ మెంట్ ఇవ్వలేదా..?
అన్ని రాజకీయ పార్టీల్లానే ఊపేస్తాం.. లేపేస్తాం.. ఊదేస్తాం అంటూ భారీ డైలాగులే చెప్పింది. కేంద్రానికి ప్రజెంటేషన్ ఇస్తాం, కేంద్రాన్ని ఒప్పిస్తాం, ఉక్కును కరగనీకుండా చేస్తాం.. అని నమ్మకంగా చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ ప్రభుత్వమే కాబట్టి ఏపీ బీజేపీ సత్తా చాటి.. ఫలితాలు సాధిస్తుందనే అందరూ ఊహించారు. విశాఖ ఉక్కు విషయంలో కేంద్రంలోని పెద్దల్ని ఒప్పించేందుకు ఢిల్లీ వెళ్లింది సోము వీర్రాజు ఆధ్వర్యంలో ఏపీ బీజేపీ బృందం. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిశారు. వినతిపత్రం అయితే ఇచ్చారు కానీ.. హామీ పొందలేదు. దీంతో మరింత ఉన్నతస్థాయి నాయకులకు వెళ్లి సమస్య గురించి మొర పెట్టుకోవాలని చూశారు. ఇందులో భాగంగా అమిత్ షాను కలిసి సమస్యను మొర పెట్టుకోవాలని.. హామీ తెచ్చుకోవాలని ఆశ పడ్డారట. అమిత్ షాను ఒప్పిస్తామనే అనుకున్నారు. కానీ.. ఆయన షాక్ ఇచ్చినట్టు మీడియాలో ప్రచారం అవుతోంది. మూడు రోజులు ఉన్నా అపాయింట్ మెంట్ ఇవ్వలేదని.. విధానపరమైన నిర్ణయాల్లో పార్టీ జోక్యం ఏమిటి? అని అసహనం చేసారని సమాచారం.
ఏపీ బీజేపీ పరిస్థితి ఏంటో..?
పై వార్తల్లో నిజం ఉంటే.. ఏపీ బీజేపీకి ఇది ఆత్మహత్యాసదృశ్యమే అవుతుంది. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఏపీ బీజేపీ నాయకులను మందలించారని తెలుస్తోంది. పార్టీ గురించి మాట్లాడితే ఓకే కానీ.. ప్రభుత్వ నిర్ణయాలపై మాట్లాడొద్దని..! దీంతో ఖంగుతిన్న ఏపీ బీజేపీకి ఏం చేయాలో కూడా అర్ధంకాని పరిస్థితి ఉందని అంటున్నారు. ఓవైపు తిరుపతి ఉప ఎన్నిక వస్తోంది. లాంగ్ రన్ లో ఏపీలో బీజేపీ బలపడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రమే సమస్యలు సృష్టిస్తే.. ఏపీలో ఎదిగేది ఎలా అని నాయకులు తల పట్టుకుంటున్నారట. ఇప్పుడిప్పుడే పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ కంటే ఉనికి ఎక్కువ చాటుకుంటోంది జనసేన. సుదూర లక్ష్యంలో భాగంగా ఏపీలో ప్రత్యామ్నాయం కావాలని చూస్తున్న జనసేన.. బీజేపీతో ఉక్కుపై ఎలా ముందుకెళ్తుందో.. బీజేపీ ఏం చేస్తుందో చూడాలి. కోట్లాదిమంది రైతులకు సంబంధించిన బిల్లుల అంశంలో కేంద్రం ఇప్పటికీ ముందడుగు వేస్తుంటే.. వేలల్లో ఉన్న ఉద్యోగుల కోసం వెనకడుగు వేస్తుందా..? చూద్దాం..!!