కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో తమిళనాడులోని కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకూ 150 రోజుల పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో తమిళనాడుకు చెందిన వివాదాస్పద కేథలిక్ పాస్టర్ జార్జ్ పూనయ్యతో భేటీ అవ్వడం, ఆయన మాట్లాడిన సంభాషణ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో బీజేపీ విమర్శలు అందుకుంది. విషయంలోకి వెళితే.. కన్యాకుమారి జిల్లా పులియూర్ కురుచిలోని చర్చిలో పాస్టర్ పూనయ్యతో సహా పలువురు క్రైస్తవ పాస్టర్ లతో రాహుల్ గాంధీ కొద్ది సేపు ముచ్చటించారు. ఏసు క్రీస్తు కూడా భగవంతుడి రూపమే కదా.. నిజమేనా అని జార్జ్ పున్నయ్యను రాహుల్ ప్రశ్నించగా, ఆయనే (ఏసు క్రీస్తు) అసలైన దేవుడు. దేవుడు.. ఒక నిజమైన మనిషిలానే అవతరించాడు. శక్తిలా కాదు. అందుకే మనం మనిషినే చూస్తాాం అని సమాధానమిచ్చారు పాస్టర్ పూనయ్య.
అయితే వివాదాస్పద పాస్టర్ తో రాహుల్ సమావేశం కావడాన్ని బీజేపీ తప్పుబట్టింది. ఆయన గతంలో ఓ మతంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో బహిరంగ క్షమాపణ కూడా చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా తదితర బీజేపీ నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గత ఏడాది జూలైలో అరెస్టు కూడా అయ్యారు. ఆ విషయాలను ప్రస్తావిస్తూ భారత్ తోడో (దేశాన్ని విడగొట్టే) శక్తులతో కలిసి భారత్ జోడో ( భారత్ ను ఐక్యం చేసే) యాత్ర చేస్తారా అంటూ బీజేపీ అధికార ప్రతినిధి షెహ్ జాద్ పూనావాలా ప్రశ్నిస్తూ, రాహుల్, పూనయ్య సంభాషణల వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
మరో పక్క రాహుల్ గాంధీ ధరించిన షర్ట్ పైనా కామెంట్స్ చేస్తూ బీజేపీ విమర్శలు చేస్తొంది. బీజేపీ ట్వీట్ లకు అదే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పీఎం మోడీ డ్రస్, మోడీ కళ్లద్దాల ధరలను తెలియజేస్తూ కౌంటర్ ఇచ్చింది. రాహుల్ తెలుపు కలర్ బుర్ బెర్రీ టీ షర్ట్ ధరించగా, ఆ ఫోటోను షేర్ చేస్తూ భారత్ దేఖో అనే క్యాప్షన్ తో టీ షర్టు ధర రూ.41వేలు అని బీజేపీ విమర్శించింది. దీనిపై కాంగ్రెస్ స్పందిస్తూ … రాహుల్ గాంధీ టీషర్ట్ కాస్ట్ సరే.. మరి ప్రధాని నరేంద్ర మోడీ ధరించిన రూ.10 లక్షల సూట్ సంగతేంటంటూ కౌంటర్ ఇచ్చింది. రాహుల్ గాంధీ చేపట్టిన యాత్రకు ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని, దానిని చూసి బీజేపీ భయపడుతుందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. ఇలా కాంగ్రెస్, బీజేపీల మధ్య ట్వీట్ వార్ సాగుతుండగా, రాజస్థాన్ పర్యటనలో ఉన్న అమిత్ షా కూడా అక్కడి బహిరంగ సభలో రాహుల్ టీషర్ట్ పై విమర్శలు సంధించారు.