తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధమని ప్రకటించిన ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుని కొందరు వెనక్కు లాగుతున్నారని సమాచారం.
ఇందుకు రకరకాల కారణాలు వినవస్తున్నాయి.నిజానికి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధం కాకుండా బిజెపి గనుక అభ్యర్థిని నిలబెడితే మద్దతు ఇవ్వాలని యోచిస్తోంది.వాస్తవానికి ఎవరి దమ్ము ఎ౦తో చూసుకోవలసింది వైసిపి టిడిపిలే.వాస్తవానికి ఏపీలో వైసీపీ తో పోటీ పడే స్థాయిలో ఇంకా బీజేపీ లేదన్నది నిర్వివాదాంశం.ఈ పరిస్థితుల్లో అక్కడ బీజేపీ పోటీచేసి ఓడిపోవడం కంటే అసలు ఎన్నికలకు దూరంగా ఉండటం మంచిదని కమలనాథులు అభిప్రాయపడుతున్నారు.అంతకుమించి ఈ ఎన్నికల్లో కనుక బిజెపి ఏ పరిస్థితుల్లోనైనా టిడిపి మద్దతు తీసుకుంటే అది ఇంకా పార్టీని డ్యామేజ్ చేయగలదని వారు ఆందోళన చెందుతున్నారు.ఎలాగూ గెలిచే అవకాశం లేనపుడు అసలు పోటి చేయటం ఎందుకన్నది కొందరి ప్రశ్న.
టిడిపి మద్దతు తీసుకుంటే దాన్ని ఎలా సమర్థించుకోగలమని మరికొందరు పార్టీని అడుగుతున్నారు.ఇప్పటికే రాష్ట్రంలో జనసేనతో బీజేపీకి పొత్తు ఉంది.మరోవైపు జనసేనకు టిడిపితో లోపాయికారి అవగాహన ఉందన్న అభిప్రాయం లేకపోలేదు.ఇప్పుడు బిజెపి గనుక అటు టిడిపి ఇటు జనసేన మద్దతు తీసుకుంటే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయని పార్టీ సీనియర్లు చెబుతున్నారు.అంతేగాక ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో బిజెపికి చెందిన పరిమళ నత్వాని అనే వ్యాపారికి ఎంపీగా వైసిపి అవకాశం ఇవ్వడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. దీనికి తోడు అకాలీదళ్ ఎన్డీఎకు దూరమయ్యాక ఆ స్థానాన్ని వైసీపీ హస్తినలో భర్తీ చేయడానికి సిద్ధంగా ఉంది. మోడీ ప్రభుత్వానికి అన్ని విధాల జగన్ మద్దతు ఇస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో గెలవలేని ఉప ఎన్నికల్లో పోటీ చేసి వైసీపీకి శత్రువుగా మారడం అవసరమా అని బిజెపి వర్గాలు తర్జనభర్జన పడుతున్నాయి. పోటీకి దూరంగా ఉంటే కనీసం పరువైనా మిగులుతుందని అంతే గాక భవిష్యత్తులో వచ్చే కొన్ని రాజకీయ పరమైన ఇబ్బందులను కూడా తప్పించుకోవచ్చునని వారు సోమువీర్రాజు చెవిలో పోరుతున్నారట.ఈ నేపథ్యంలో బిజెపి కూడా పోటీ నుండి తప్పుకుంటే తిరుపతి లోక్సభ స్థానం ఏకగ్రీవంగా వైసీపీకి దక్కుతుంది ఒకవేళ పోటీ జరిగినా వన్సైడ్ వార్ గా మిగులుతుంద౦టున్నారు.