తెలంగాణలో 2023 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతూ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది. రాష్ట్ర విభజన అనంతరం టీడీపీ అడ్రస్ లేకుండా పోవడం, కాంగ్రెస్ పార్టీ అంతర్గత గ్రూపు రాజకీయాలతో బలహీన పడటం, మోడీ చరిష్మా తదితర కారణాలతో బీజేపీ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగి అధికార టీఆర్ఎస్ కు ప్రధాన పోటీగా మారింది. “నీవు నేర్పిన విద్యే నీరజాక్షా” అన్నట్లు తెలంగాణ ఉద్యమ సమయంలో గానీ ఎన్నికల సమయంలో గాని ఆవేశపూరిత ప్రసంగాలతో ప్రజలను, యువతను ఆకట్టుకున్న టీఆర్ఎస్ నేతల వ్యూహాన్నే నేడు బీజేపీ నేతలు అందిపుచ్చుకున్నారు.
రాష్ట్రంలో ఎంపీ బండి సంజయ్ బీజేపీ రధసారధి పగ్గాలు చేపట్టిన అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వంపై దూకుడుగానే ముందుకు వెళుతున్నారు. గడచిన పార్లమెంట్ ఎన్నికల్లో అధికారం టీఆర్ఎస్ పార్టీ తొమ్మిది స్థానాలకే పరిమితం కావడం, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కంటే ఒక స్థానం ఎక్కువగా నాలుగు లోక్ సభ స్థానాలు గెలుచుకోవడం బీజేపీకి బూస్ట్ ఇచ్చినట్లు అయ్యింది. ఆ ఎన్నికల ఫలితాల స్ఫూర్తితోనే బీజేపీ వ్యూహాలను రచించుకొని ముందుకు సాగుతున్నది.
తెలంగాణ వ్యాప్తంగా బలం పుంజుకునేందుకు బండి సంజయ్, మరో ఎంపీ ధర్మపురి అరవింద్, కీలక నేతలు రఘునందన రావు, డీకె అరుణ వంటి నాయకులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. గడచిన ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీగా జరగ్గా ప్రస్తుతం టీఆర్ఎస్, బీజేపీ అన్నట్లుగా కనబడుతున్నది అంటున్నారు. అందుకే మంత్రి కేటీఆర్ గానీ ఇతర మంత్రులు గానీ బీజేపీనే టార్గెట్ చేస్తూ విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల దుబ్బాక ఎమ్మెల్యే కరోనాతో మృతి చెందగా జరగబోయే ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందని, కాంగ్రెస్ మూడవ స్థానంలో ఉండవచ్చని ఇప్పటికే ప్రచారం జరుగుతున్నది. రాబోయే ఎన్నికల్లో కారు స్పీడ్ కు కాషాయం బ్రేక్ వేసి కల నెరవేర్చుకుంటుందా? కేసీఆర్ యే హ్యాట్రిక్ నమోదు చేసుకుంటారో చూడాలి మరి.