Ap New Districts: కొత్త జిల్లాలు Ap New Districts ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు అంశం ఇప్పటిది కాదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే జిల్లాల విభజన గురించి ఆలోచించారు. కానీ.. అమల్లోకి రాలేదు. ఈలోపు ఎన్నికలు రావడం టీడీపీ ఓటమి.. వైసీపీ అధికారంలోకి వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పాలనా పగ్గాలు చేపట్టడం జరిగింది. ఈనేపథ్యంలో ఏపీలో ప్రస్తుతమున్న 13 జిల్లాలను 25 జిల్లాలుగా మార్చాలని నిర్ణయించారు. ఇందుకు 2020 జూలైలో పునర్ వ్యవస్థీకరణ కమిటీకి క్యాబినెట్ ఆమోదం కూడా లభించింది. అప్పటి సీఎస్ నేతృత్వంలో కమిటీ వేసి మూడు నెలల్లో నివేదిక సిద్ధం చేయాలని కూడా ఆదేశించారు.
రాష్ట్రంలోని 25 పార్లమెంటరీ నియోజకవర్గాలను ఒక్కో జిల్లా చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. ఇందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈసరికి ఓ నిర్ణయం కూడా వెలువడాల్సింది. కానీ.. ఇప్పుడు ఈ ప్రక్రియ ఆగిపోయింది. కారణం.. దేశంలో జనగణన జరక్కపోవడమే. ప్రతి పదేళ్లకోసారి దేశంలో జరగాల్సిన జనగణన ఈసారి కరోనా వల్ల జరగలేదు. ఎప్పుడు జరుగుతుందో కూడా తెలీదు. ఈ నేపథ్యంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణ అంశం ఆగిపోయింది. జనగణన పూర్తయ్యేవరకూ ఏ రాష్ట్రంలో కూడా భౌగోళిక సరిహద్దులు మార్చడానికి వీల్లేదని భారత రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం స్పష్టం చేసింది. సమాచారహక్కు చట్టం కింద సామాజిక కార్యకర్త ఇనగంటి రవికుమార్ అడిగిన ప్రశ్నకు రిజిస్ట్రార్ జనరల్ శాఖ ఇచ్చిన సమాధానం మేరకు ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
దీంతో ఏపీలో జిల్లాల పునర్విభజన ఆగినట్టే. ఇలా చేస్తే గ్రామాలు, పట్టణాలు వాటి సరిహద్దులు మారతాయి. కొత్త పట్టణాలు, గ్రామాలు ప్రకటిస్తారు. కొన్ని విలీనం అవుతాయి.. మరికొన్ని వేరే ఊళ్లలో కలుస్తాయి. సరిహద్దులు మారతాయి. అన్నింటికీ మించి జిల్లాలే ఏర్పడతాయి. ఇవన్నీ జనగణనకు అడ్డంకిగా, ఇబ్బందిగా మారతాయి. అందుకే సరిహద్దులు మార్చేందుకు వీల్లేదని స్పష్టం చేసింది కేంద్రం. జిల్లాల పునర్విభజన వల్ల కొత్తగా కలెక్టర్లు, ఐపీఎస్, జిల్లా పరిషత్ లు, పరిపాలనా సౌకర్యం పెరుగుతుంది. సీఎం జగన్ తన పాదయాత్రలో కూడా కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. ఈమేరకు ఆయన అధికారంలోకి వచ్చాక పాలనాపరమైన నిర్ణయం తీసుకున్నా కరోనా వచ్చి ఈ ప్రక్రియను మరింత ఆలస్యం చేసింది.