బుల్లెట్ ట్రైన్… అనేక మంది కల. ఎక్కడో ఉండే నగరాల్లో ఈ సేవల గురించి విన్నవారు మన సిటీల్లో ఇలాంటివి ఉండాలని అనుకుంటారు. అయితే, ఆ కల నెరవేరనుంది.
దేశ ఆర్థిక రాజధాని అనే పేరున్న ముంబైకి. మన రాజధాని నగరమైన హైదరాబాద్కు ఈ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. హైదరాబాద్ నుంచి ముంబైకి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయినా రైల్లో 12 గంటల జర్నీ తప్పనిసరి. అదే 300 కి.మీ స్పీడ్తో దూసుకెళ్లే బుల్లెట్ ట్రైన్ ద్వారా జస్ట్ 4 గంటల్లోనే ముంబై వెళ్లవచ్చు. ప్రయాణ ఇబ్బందులూ ఉండవు. అది నిజమయ్యే రోజులు రాబోతున్నాయి.
హైదరాబాద్కు బుల్లెట్ రైల్
దేశం మొత్తం 7 రూట్లలో బుల్లెట్ ట్రైన్ కారిడార్లను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ముంబై టు హైదరాబాద్ రూట్ ఒకటి. ముంబై–పుణె–హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్కు స్పీడ్గా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న రైల్వే ట్రాక్లు 80 నుంచి 160 కిలోమీటర్ల స్పీడ్ను మాత్రమే తట్టుకుంటాయి. కాబట్టి బుల్లెట్ ట్రైన్స్ కోసం కొత్త ట్రాక్లు వేయాలి. అందుకోసమే ఇప్పుడు టెండర్ల ప్రాసెస్ మొదలు కానుంది. 711 కి.మీ పనులకు నవంబర్లోనే కేంద్ర ప్రభుత్వం టెండర్లను పిలవనుంది. వచ్చే ఏడాది పనులు ప్రారంభమయ్యే చాన్స్ ఉంది. బుల్లెట్ ట్రైన్తో జర్నీ టైం తగ్గడమే కాకుండా వాణిజ్య పరంగానూ మరిన్ని వసతులు అందనున్నాయి.
టెండర్లు ఎప్పుడంటే…
డీపీఆర్ (డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్)పై చర్చించేందుకు నవంబర్ 5న ప్రీ బిడ్ సమావేశాన్ని నిర్వహించనుంది. మీటింగ్లో కారిడార్పై సర్వేతో పాటు అండర్గ్రౌండ్ వసతులు, సబ్స్టేషన్లకు కరెంట్ సరఫరా వంటి విషయాలపై చర్చించనున్నారు. నవంబర్ 11న టెండర్లను పిలవనున్నారు. 18న టెండర్లను ఓపెన్ చేస్తారు. వచ్చే ఏడాది పనులను ప్రారంభించి మూడు నాలుగేళ్లలో బుల్లెట్ ట్రైన్ కారిడార్ పనులను పూర్తి చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుతం అహ్మదాబాద్– ముంబై రూట్లో బుల్లెట్ ట్రెయిన్ కారిడార్ పనులు నడుస్తున్నాయి. హైదరాబాద్ రూట్తో పాటు మరికొన్ని రూట్ల నిర్మాణం కోసం నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ సన్నాహాలు మొదలు పెట్టింది.