Telugu States Politics: తెలుగు రాష్ట్రాల రాజకీయాలు Telugu States Politics ఒక్కసారిగా హీటెక్కాయి. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఇద్దరు సీఎంలు వర్సెస్ ఇద్దరు సొంత పార్టీ నాయకుల మధ్య పోరు. తెలంగాణలో సీఎం వర్సెస్ రాష్ట్ర మంత్రి అయితే.. ఏపీలో సీఎం వర్సెస్ ఎంపీ. ఈ రెండు పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపాయి. అయితే.. తెలంగాణలో రాజకీయ పోరు ఉన్నా.. ఈటల వ్యవహారంలో సీఎం కేసీఆర్ నిర్ణయమే ఫైనల్ అయింది. కానీ.. ఏపీలో పరిస్థితి వేరు. ఎంపీ రఘురామకృష్ణ రాజు విషయంలో ప్రస్తుతం జరుగుతున్న పరణామాలు హైకోర్టు, సుప్రీంకోర్టు, ఢిల్లీ వరకూ వెళ్లిపోయింది. సీఎం జగన్ చుట్టూ రాజకీయ పార్టీలు ముప్పేట దాడి చేస్తూండగా ఆయన ఎదురొడ్డి పోరాడుతున్నారు.
తెలంగాణలో మంత్రి హోదాలో ఈటలకు, సీఎం కేసీఆర్ కు దాదాపుగా రెండేళ్ల నుంచీ సఖ్యత లేదు. కేసీఆర్ కంటే ఈటలే ఎక్కువగా ఇన్ డైరక్ట్ వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరి మధ్య వైరం ఉందని గతం నుంచే వార్తలు వస్తున్నాయి. దీంతో ఈటల భూకబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆయన్ను పదవి నుంచి తప్పించారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేయడమే మిగిలింది. ఏపీలో ఎంపీ రఘురామకృష్ణ రాజు ఏకంగా డైరక్ట్ అయిపోయారు. సీఎం జగన్, ప్రభుత్వంపై నేరుగా వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ఏకంగా ఢిల్లీలో ఉండి ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వంపై, సీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓదశలో హద్దు దాటి రెడ్డి కులస్థులపై డైరక్ట్ గానే వ్యాఖ్యలు చేశారు.
దీంతో ప్రభుత్వం ఆయనపై చర్యలు చేపట్టింది. ప్రభుత్వాన్ని అస్థిరపరచడం, కులాల మధ్య వైరం తెచ్చే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆయన్ను సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ అంశం తీవ్ర సంచలనం రేపుతోంది. సీఐడీ స్పెషల్ కోర్టు, జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ఈ అంశం ఉంది. దీనిపై ఎటువంటి తీర్పు వస్తుందో చూడాల్సి ఉంది. తెలంగాణలో ఉద్యమం ద్వారా ఎదిగారు ఈటల. దీంతో జరిగిన పరిణామాలపై బయట నుంచి పోరాడుతున్నారు. ఏపీలో వైసీపీ నుంచి రఘురామ ఎంపీగా గెలిచారు. కానీ.. పార్టీపైనే తిరుగుబాటు చేశారు. దీంతో రెండు రాష్ట్ర రాజకీయాల్లో ఓ కుదుపు. ఏం జరుగుతుందో చూడాల్సిందే..!