టీడీపీకి ప్రస్తుతం అత్యంత గడ్డు కాలం నడుస్తోంది. పార్టీకి ఎటు చూసినా సవాళ్లే ఎదురవుతున్నాయి. పార్టీలో జరుగుతున్న పరిణామాలు చంద్రబాబుకు తలనొప్పిగా మారుతున్నాయి. సీఎం జగన్ దూకుడు చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు, నాయకులు జగన్ వైపు మొగ్గు చూపుతున్నారు. పార్టీ నుంచి జారిపోతున్న నాయకులను చంద్రబాబు అడ్డుకోలేక పోతున్నారు. ప్రస్తుత కరోనా సమయంలో చంద్రబాబు హైదరాబాద్ నుంచి ఏపీకి రావటం లేదు. పార్టీ వాణి వినిపించే నాయకుడు లేకపోవడం టీడీపీకి మైనస్ లా మారింది. దీంతో పార్టీలో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో పార్టీ నాయకత్వ మార్పు చేయాల్సిందే అని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయని సమాచారం.
అచ్చెన్నాయుడే ఎందుకు అంటే..
జగన్ దెబ్బకి ఉత్తరాంధ్రలో టీడీపీకి భారీ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. విశాఖలో రాజధానికి టీడీపీ విముఖంగా ఉందని తేలిపోయింది. దీంతో అక్కడి నాయకులు వైసీపీకి క్యూ కడుతున్నారు. వైసీపీ దెబ్బకి ఉత్తరాంధ్రలో టీడీపీ కంచుకోటల్లో కూడా బీటలు వారుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీని కాపాడుకోవడానికి ప్రస్తుత టీడీపీ అధ్యక్షుడు కంటే బలమైన నాయకుడిని ఎన్నుకోవాలని పార్టీ ఆలోచిస్తోంది. దీంతో అచ్చెన్నాయుడు పేరు తెర మీదకు వచ్చింది. పైగా బీసీ వర్గం నాయకుడు కాబట్టి ఆ వర్గాల్లో పట్టు సాధించడానికి కూడా అచ్చెన్ననే ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఈఎస్ఐ కుంభకోణం ఆరోపణలు, అరెస్టు, బెయిల్ అంశాలతో అచ్చెన్న బాగా వార్తల్లో నిలిచారు. దీంతో ఏపీ పార్టీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడిని నియమించాలనే ఆలోచనకు చంద్రబాబు వచ్చినట్టు సమాచారం.
జగన్ దూకుడుకు కళ్లెం వేయగలరా..?
జగన్ ప్రభుత్వంపై యనమల, జవహర్, బొండా ఉమ, దేవినేని ఉమ.. వంటి కొద్దిమంది ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూనే ఉన్నారు. కానీ.. పార్టీని ఒక్కతాటిపై నడిపించే నాయకుడు ఉండాలనేది చంద్రబాబు ఆలోచన. జగన్ ప్రభుత్వం అచ్చెన్నపై ఆరోపణలు చేసి జైలుకి పంపించడం.. పెద్దగా ఆధారాలు లభ్యం కాకపోవడం.. బెయిల్ పై విడుదలవడం.. వంటి అంశాలతో అచ్చెన్నాయుడు ఉన్నారు. ఈ సమయంలో జగన్ ప్రభుత్వంపై అచ్చెన్న విరుచుకుపడే అవకాశాలు ఎక్కవని అందుకే ఆయనను చంద్రబాబు అధ్యక్షుడిగా ప్రతిపాదిస్తున్నారని అంటున్నారు. ఈనెల 27నే పార్టీ పగ్గాలు అచ్చెన్నకు అప్పగించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.