(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం తెలుగు రాష్ర్టాల ఆర్థిక పరిస్థితిపైనా పడింది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ర్టాలలోని ఉద్యోగులు, ప్రజా ప్రతినిధుల వేతనాలలో కోత విధించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధించాల్సిన పరిస్థితి ఉందని ఇప్పటికే తెలంగాణ సి ఎం కేసీఆర్ వెల్లడించారు. ఇదే దారిలో ఆంధ్రప్రదేశ్ సిఎం జగన్ కూడా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిస్తోంది. ఉద్యోగులు త్యాగానికి సిద్ధంగా ఉండాలన్నట్లు సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఉద్యోగులను షాక్ కు గురి చేశాయి.
కేసీఆర్ ఏమ్మన్నారంటే
కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. ప్రభుత్వానికి వచ్చే రాబడి గణనీయంగా పడిపోయింది. ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. కరోనా కారణంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా భారీగా ఆదాయం కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.
కష్టం అందరూ పంచుకోవాల్సిందే. ఇది చాలా పెద్ద లాస్. మొదటికే మోసం వచ్చేలా ఉంది. ఎమ్మెల్యేల జీతాల కూడా బంద్ పెట్టాల్సి వస్తుందేమో. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కోత విధించాల్సి వస్తే విధించాల్సిందే. ఎవరూ అతీతులు కాదు. ప్రభుత్వ ఉద్యోగుల రాష్ట్రంలో భాగం కాదా? కష్టం వస్తే అందరమూ పంచుకోవాలి కదా? ఇది లగ్జరీ పీరియడ్ కాదు. మనం క్రైసిస్ లో ఉన్నాము. విపత్తు వచ్చినప్పుడు ఎదుర్కోవాలి కదా. కొన్ని రోజులు చూసుకుని నడవాలి కదా. అందరూ తగ్గించుకోవాలి. తప్పదు కదా. గండం గట్టెక్కే వరకు అందరం ఊపిరి బిగపెట్టుకుని కాంప్రమైజ్ కావాలి. కరువు వచ్చినప్పుడు ఉన్నంతలో అందరం తింటాం. ఇది కూడా అంతే అని కేసీఆర్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.
కెసిఆర్ బాటలో
తెలంగాణ సి ఎం కేసీఆర్ బాటలోనే ఆంధ్రా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పయనిస్తారని ఉద్యోగులు భావిస్తున్నారు. అసలే రెవిన్యూ లోటులో ఉన్న ఆంధ్రప్రదేశ్ను ‘కరోనా’ భారీగా దెబ్బ తీసింది. ప్రభుత్వం ప్రకటించిన నవరత్నాలు అమలు చేయడానికే ఖజానాలో సొమ్ము లేదు. పాత బిల్లులు వేల కోట్లలో చెల్లింపు చేయాల్సి ఉన్నా..వాటిని పక్కన పెట్టి ‘జగన్’ ప్రభుత్వం నవరత్నాలను అమలు చేస్తోంది. ఇటువంటి స్థితిలో ‘కరోనా’ రావడంతో ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక ఇక్కట్లను ఎదుర్కొంటుంది. దీనిపై ఉద్యోగులతో చర్చించే అవకాశం ఉంది. కనీసం మూడు నెలల పాటు జీతాల్లో కోత ఉంటుందని చెబుతున్నారు.
వీరికి మినహాయింపు
‘కరోనా’సహాయక సేవల్లో నిమగ్నమైన వైద్య, పోలీసు, మున్సిపల్ శాఖల ఉద్యోగులకు మాత్రం ఎటువంటి కోతలు లేకుండా జీతాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అదే విధంగా పెన్షనర్ల చెల్లింపులలోనూ ఎటువంటి కోతలు విధించకూడదని నిర్ణయించినట్లు సమాచారం.
ప్రజా ప్రతినిధుల వేతనాలకు
ప్రజాప్రతినిధుల జీతాలపై కూడా వేటు వేస్తారని అంటున్నారు.
ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు సైతం ఈ నెల జీతాలు ఇవ్వకూడదని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయించినట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఏటా వేతనాలు, పెన్షన్ల రూపంలో దాదాపు 2700 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారు. ప్రస్తుత గడ్డు కాలంలో వేతనాలపైన 30శాతం మేర కోత విధించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల కారణంగా ఉద్యోగులు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవించే అవకాశం ఉందని భావిస్తున్నారు.