తెలుగుదేశం పార్టీలో బాగా వాగ్ధాటి ఉన్న నాయకుడు, అధికార పార్టీపై తరచు విరుచుకుపడే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే యరపతినేని శ్రీనివాసరావు. పల్నాడు ప్రాంతానికి చెందిన యరపతినేని శ్రీనివాసరావు గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం నుండి 1994 తరువాత 2009, 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు.
వైసిపి నేతలపై ఒంటికాలిపై లేస్తూ ఆరోపణలు చేసే యరపతినేని కొంత కాలంగా సైలెంట్ అయిపోయారు. ఇటీవల కాలంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లలో అమరావతి రాజధాని గురించి, టిడిపి మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర అరెస్టుల గురించి మాత్రమే మాట్లాడారు. అయితే అదే జిల్లాకు చెందిన వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై అక్రమ మైనింగ్ ఆరోపణలను సొంత పార్టీ నేతలు చేసినా టిడిపి తరపున ఎవరూ మాట్లాడలేదు.
టిడిపి నేతలపై వైసిపి ప్రభుత్వం దూకుడుగా వెళుతున్న నేపథ్యంలో చాలా మంది టిడిపి నేతలు సైలెంట్ అవుతున్న విషయం తెలిసిందే. అదే మాదిరిగా యరపతినేని కూడా గత కొద్ది రోజులుగా మౌనంగా ఉండిపోయారు.గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతం సున్నపురాయి నిక్షేపాలకు ప్రసిద్ధి అన్న విషయం అందరికీ తెలిసిందే.
అయితే పిడుగురాళ్ల, దాచేపల్లి ప్రాంతాల్లో 2011 నుండి 2018 మధ్య కాలంలో సున్నపు రాయి అక్రమ తవ్వకాలు జరిపారని అభియోగం యరపతినేనిపై ఉంది. సున్నపురాయి అక్రమ తవ్వకాలపై సిబిఐ దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం సిబిఐ దర్యాప్తునకు ఆరేశించి ఆరు నెలలు కావస్తున్నా కేసులో పురోగతి లేదు.ఈ నేపథ్యంలోనే సత్తెనపల్లి వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు పై స్పపక్షానికి చెందిన నాయకులే కేసు పెట్టడంతో అక్రమ మైనింగ్ వ్యవహారం మళ్లీ వెలుగులోకి వచ్చింది.
ఇటీవల వైసిపికి చెందిన కీలక నేత ఒకరు కేంద్రహోంశాక మంత్రి అమిత్ షా, ఢిల్లీలోని సిబిఐ ఉన్నతాధికారులను నేరుగా కలిసి గుంటూరు జిల్లా అక్రమ మైనింగ్ వ్యవహారం గురించి వివరించి దర్యాప్తును వేగంవంతం చేయాలని కోరారట. దీనితో విశాఖలోని సిబిఐ కార్యాలయం నుండి అధికారులు గుంటూరుకు చేరుకొని మైనింగ్ శాఖ కార్యాలయంలో రికార్డులను పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది.
అరెెస్టుకు రంగం సిద్ధం
మరో పక్క అక్రమ మైనింగ్ కేసు విచారణలో భాగంగా సిబిఐ అధికారులకు ప్రాధమిక అధారాలు లభిస్తే వెంటనే యరపతినేని శ్రీనివాసరావును అరెస్టు చేయనున్నారని సమాచారం. ఆరేడు సంవత్సరాలకు సంబంధించిన అక్రమ క్వారీయింగ్ పై సమాచార సేకరణ సిబిఐ అధికారులకు కష్టతరంగా మారిన నేపథ్యంలో మైనింగ్ శాఖలోని ఒక రిటైర్డ్ అధికారి సిబిఐ అధికారులకు తోడ్పాటు అందిస్తున్నారుట.
సుమారు ఏడు సంవత్సరాల కాలంలో జరిగిన క్వారీయింగ్ పై సిబిఐ విచారణ సాగిస్తున్నది. నిబంధనల మేరకు క్వారీయింగ్ ఎంత జరగాలి, అనుమతికి మించి ఏమైనా తవ్వకాలు జరిపారా అనేది విచారణలో తేలాల్సి ఉంది. కొద్ది రోజులుగా సిబిఐ అధికారులు ఈ అక్రమ మైనింగ్ కు సంబంధించిన రికార్డులను పరిశీలన చేస్తుండటంతో యరపతినేని అరెస్టుకు రంగం సిద్ధం అవుతున్నదని జిల్లాలో జోరుగా వినిపిస్తున్నది.