(విశాఖ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టింగ్స్ పెట్టిన వారిపై సీబీఐ కేసులు నమోదు చేసింది. ఏపి హైకోర్టు ఆదేశాల మేరకు గతంలో మొత్తం 17 మందిపై సిఐడి కేసులు నమోదు చేసింది. సీఐడి దర్యాప్తుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులను సీబీఐకి అప్పగించాలని సిఐడీని హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సీబీఐ 12 కేసులను విశాఖలో రిజిస్టర్ చేసింది. సీఐడీ సైబర్ క్రైమ్ సెల్ నమోదు చేసిన కేసులనే యథాతథంగా తీసుకుని కేసులు నమోదు చేసినట్లు సీబీఐ తన ఎఫ్ఐఆర్లో పేర్కొంది.
నిందితులు ఫేస్ బుక్, ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినట్లు సీబీఐ గుర్తించింది. నిందితుల్లో ముగ్గురు విదేశాల నుండి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినట్లు సీబీఐ తెలిపింది. ఏపి సీఐడి సైబర్ క్రైమ్ నమోదు చేసిన 12 ఎఫ్ఐఆర్లను ఒకే కేసుగా పరిగణించి దర్యాప్తు చేస్తున్నట్లు సీబీఐ ఎస్పీ విమలాదిత్య తెలిపారు. కేసు దర్యాప్తును సీబీఐ డీఎస్పి శ్రీనివాసరావుకు అప్పగిస్తూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసుల్లో నిందితులుగా డి కొండారెడ్డి, ఎ మణి, పి సుధీర్, ఆదర్శరెడ్డి, అభిషేక్ రెడ్డి, శివారెడ్డి, ఎ శ్రీధర్ రెడ్డి, జె వెంకట సత్యనారాయణ, జి శ్రీధర్ రెడ్డి, లింగారెడ్డి, చందూరెడ్డి, శ్రీనాధ్, డి కిషోర్ రెడ్డి, చిరంజీవి, ఎల్ రాజశేఖరరెడ్డి, గౌతమిలు ఉన్నారు.