తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయంగా గట్టి సవాలు ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే.
ఓ వైపు ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పేయడం మరోవైపు అధికార వైసీపీ తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తున్న తరుణం కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇలాంటి కీలక సమయంలో వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో ఓ ఊహ చర్చ సైతం జోరుగా ప్రచారంలో ఉంది.
జగన్ ఢిల్లీ టూర్తో….
ఏపీ సీఎం వైఎస్ జగన్ స్వల్ప వ్యవధిలోనే ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. గత పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిషాతో సమావేశం అయిన వైఎస్ జగన్ తాజా పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం అవనున్నట్లు సమాచారం. ఈ సమయంలోనే తెలుగుదేశం వర్గాలు సోషల్ మీడియాలో కొత్త ప్రచారం మొదలుపెట్టాయి.
బాబు, లోకేష్ స్పెషల్ ఫోకస్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ అనంతరం అనేక పరిణామాలు చోటు చేసుకోనున్నాయని అంటున్నారు. రాజధాని భూముల అక్రమాలపై సీబీఐ విచారణ చేయాలని ఇప్పటికే వైసీపీ ఎంపీలు పార్లమెంటులో ప్రస్తావించడంతో పాటు.. ధర్నాలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఇదే విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వద్ద ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు సమాచారం. అయితే, దీని కేంద్రంగానే ఇంకో ప్రచారం కొందరు చేస్తున్నారని వైసీపీ సానుభూతి వర్గాలు అంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు లోకేష్పై సీబీఐ దర్యాప్తు కోరుతున్న జగన్ ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించనున్నారని టీడీపీ నేతలు భయంతో వణికిపోతున్నారని ట్రోల్ చేస్తున్నారు.
అసలు విషయం చెప్పిన నమ్మట్లేదుగా?
తమ నాయకుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనపై అసలు విషయం చెప్పినా తెలుగుదేశం శ్రేణులు నమ్మకపోవడం వారి పరిస్థితికి నిదర్శనమని వైసీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. సీఎం జగన్ గత టూరో ఇదే రీతిలో అంచనాలతో భయపడిపోయారని కామెంట్లు చేస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముందుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం జగన్ భేటీ అయినపుడు ఎవరికి వారే తమకు నచ్చింది ఊహించుకున్నారని గుర్తు చేస్తున్నారు. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న నేపథ్యంలో అమిత్ షా ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న సీఎం జగన్ అనంతరం రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని పెండింగ్ అంశాలపై అమిత్ షా కు విజ్ఞాపన పత్రం అందచేశారని పేర్కొంటున్నారు.
బాబు గుండెల్లో రైళ్లు
తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశంలో కూడా రాష్ట్ర ప్రయోజనాలే కీలక అంశమని చెప్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు, మూడు రాజధానుల ఏర్పాటు,పెండింగ్ నిధుల విడుదల గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం జగన్ చర్చించనున్నట్లు చెప్తున్నారు. అవకాశాన్ని బట్టి అంతర్వేది ఘటనపై సిబిఐ దర్యాప్తు, అమరావతి భూ కుంభకోణం,ఫైబర్ నెట్ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు అంశాలను సీఎం ప్రస్తావించనున్నట్లు చెప్తున్నారు. వాస్తవాలు ఇలా ఉంటే వైసీపీ అధినేత ఢిల్లీ టూరుతో తెలుగుదేశం పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటే తామేం చేయగలమని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.