ఢిల్లీ, జనవరి 27: ఐసిఐసిఐ బ్యాంకు-వీడియోకాన్ రుణ మంజూరు కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సిబిఐ అధికారి సుదాన్షు ధర్ మిశ్రా బదిలి వేటుకు గురయ్యారు. బ్యాంకు మాజీ సిఇఓ చందా కొచ్చర్, అమె భర్త దీపక్ కొచ్చర్ వీడియోకాన్ అధినేత వేణుగోపాల్ ధూత్పై సిబిఐ కేసు నమోదు చేసిన మరుసటి రోజే ఆ అధికారి బదిలీ అయ్యారు.
ఈనెల 24న సిబిఐ నిందితులపై కేసు నమోదు చేసింది.
సిబిఐలో బ్యాంకింగ్, సెక్యూరిటీస్ ఫ్రాడ్ విభాగంలో ఎస్పిగా ఉన్న మిశ్రాను ఝార్ఖండ్లోని రాంచిలో గల ఆర్ధిక నేరాల విభాగానికి బదిలీ చేశారు.
వీడియోకాన్ సంస్ధకు ఐసిఐసిఐ బ్యాంకు 2009లో 3,250 కోట్ల రూపాయల మేర రుణం మంజూరు చేసిన కమిటీలో చందాకొచ్చర్ ఉన్నారు. ఈ రుణం తీసుకున్న తర్వాత వీడియోకాన్ అధినేత వేణుగోపాల్ ధూత్ చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్కు చెందిన నూ పవర్ కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్లు సిబిఐ విచారణలో వెల్లడయింది.
రుణం తీసుకున్న తర్వాత వీడియోకాన్ సంస్ధ బ్యాంకుకు పూర్తి స్థాయిలో డబ్బులు చెల్లించలేదు. చందాకొచ్చర్పై ఆరోపణలు రావడంతో గత ఏడాది అక్టోబర్లో అమె పదవి నుండి వైదొలిగారు.
క్విడ్ ప్రోకోకు పాల్పడినట్లు నిర్ధారించిన సిబిఐ నిందితులు ముగ్గురిపై కేసు నమోదు చేసింది.
ఈ కేసు వెలుగులోకి వచ్చినప్పటినుంచి కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్జైట్లీపైన విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వం మళ్ళీ సిబిఐ విచారణలో జోక్యం చేసుకుంటోందని కాంగ్రెస్ అరోపించింది. తాజాగా మిశ్రా బదిలీ వివాదంపై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది స్పందిస్తూ ప్రభుత్వం అనేక కేసుల్లో సిబిఐని పావుగా వాడుకుంటోందని అరోపించారు. ప్రభుత్వానికి అనుకూలంగా లేని అధికారులను బదిలీ చేస్తోందని విమర్శించారు.