YS Viveka Murder : కడప గడపలోకి మళ్లీ Cbi అడుగుపెడుతోందా..! సంచలనం రేపిన Ys Vivek Murder కేసులో కీలక అంశాలు బయటకు వస్తున్నాయా..? అంటే పరిస్థితులు అవుననే అంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి Ys Jagan Mohan Reddyకి స్వయానా బాబాయి అయిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య రాష్ట్రంలో సంచలనం రేపింది. 2019 సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా నెల ముందు మార్చి 11వ తేదీన పులివెందులలో వివేకా దారుణ హత్యకు గురయ్యారు. అయితే.. ఈ హత్యను మొదట గుండెపోటుగా చెప్పారు. తర్వాత బాత్ రూమ్ లో కాలు జారి పడ్డారని చెప్పారు. కానీ.. వాస్తవంలో చూస్తే వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. అత్యంత క్రూరంగా జరిగిన ఆ హత్యపై ఎందరో అనుమానితులు.. ఎందరెందరిపైనో విచారణలు జరిగాయి. కానీ.. ఇప్పటికీ నిందితుల ఆచూకీ మాత్రం తెలియలేదు.
రెండేళ్లవుతున్నా.. జగన్ సీఎం అయినా..
వివేకా హత్య జరిగి దాదాపు రెండేళ్లు కావొస్తోంది. 2019 ఏప్రిల్ 11న ఎన్నికలు జరిగితే.. నెల ముందు మార్చి 11న హత్య జరిగింది. వివేకా చిన్నస్థాయి నాయకుడు కాదు. ఎంపీగా చేశారు. పులివెందులలో బాగా పలుకుబడి ఉన్న నాయకుడు. అంతకుమించి పెద్ద పేరున్న కుటుంబం ఆయనది. సాక్షాత్తూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి స్వయానా తమ్ముడు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి బాబాయి. ఇంత ఘన చరిత్ర ఉన్న నాయకుడు వివేకా. నిజానికి జగన్ సీఎం కాకముందు జరిగిన హత్య ఉదంతంలో అప్పట్లో నిందితులు వెలుగులోకి రాకపోయినా ఇప్పుడు జగన్ సీఎంగా ఉండగా విచారణ వేగవంతం కావాలి.. ఈసరికే నిందితులు వెలుగులోకి రావాలి. కానీ.. అలా జరగలేదు. విచారణలు.. జిల్లా ఎస్పీకి సిట్ బాధ్యతలు అప్పగింత, అక్కడి నుంచి హైకోర్టు ఆదేశాలతో సీబీఐ రంగంలోకి దిగడం వంటి అంశాలు జరిగాయి. కానీ.. ఇదిగో మిస్టరీ వీడుతోంది.. అనేలోపు కేసు నీరుగారిపోవడం జరుగుతోంది. ఇప్పుడు మళ్లీ సీబీఐ రంగంలోకి దిగి ఈసారి పూర్తిస్థాయి విచారణకు సిద్ధం అవతోందని తెలుస్తోంది.
సునీత అలుపెరుగని పోరాటం..
వివేకా కుమార్తె సునీతా రెడ్డి ఈ విషయంలో గట్టిగా పోరాడుతున్నారు. ఏపీ పోలీసుల వల్ల కావడం లేదు.. తనకు అనుమానాలు ఉన్నాయని హైకోర్టుని ఆశ్రయించగా కేసును సీబీఐకి అప్పగించారు. అన్న సీఎంగా ఉండగా ఆమె హైకోర్టును ఆశ్రయించి పలువురు అనుమానితుల పేర్లు హైకోర్టుకి ఇవ్వడం తీవ్ర సంచలనం రేపింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ కేసు దర్యాప్తు చేసింది. ఏకంగా 1250 మందిని కేసులో విచారించింది. అయినా చిక్కుముడి వీడలేదు. దీంతో సీబీఐ కూడా దాదాపు చేతులెత్తేసే పరిస్థితి వచ్చింది. ఏపీ పోలీసులు సేకరించిన కేసు వివరాల కోసం కోర్టుల అనుమతితో పొందినా ప్రయోజనం లేదు. మొత్తంగా కేసు తేలుతుందనగా సీబీఐ దర్యాప్తు ఆగిపోయింది. దీంతో మళ్లీ కేసు వెనుకబడిపోయింది. దీంతో.. అలుపెరుగని పోరాటం చేస్తున్న వివేకా తనయ సునీతా రెడ్డి కేరళకు చందిన ప్రముఖ హక్కుల కార్యకర్త జోమున్ పుతెన్ పురక్కల్ సాయం కోరారు. ఇందుకు తాను సహకరిస్తానని కూడా ఆయన హామీ ఇచ్చారు.
సీబీఐ ఈసారైనా తేల్చేనా..?
ఇలా కేసు అనేక మలుపులు తిరుగుతోంది. నిజానికి సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నప్పుడే ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించారు. సిట్ ఏర్పాటు చేశారు. కేసు కూడా వేగంగానే కదిలింది. విచారణలో భాగంగా కొందరు ముఖ్య సాక్షులు ఆత్మహత్య చేసుకోవడం కూడా కలకలం రేపింది. అతడు సినిమాలో సీబీఐ ఆఫీసర్ పాత్రలో ప్రకాశ్ రాజ్ అన్నట్టు.. ఈ కేసులో ఎటునుంచి వెళ్లినా అటు పోలీసులకు, ఇటు సీబీఐకి కూడా ఎక్కడోచోట దారులు మూసుకుపోతున్నాయి. దీంతో ఈ హత్య వెనుక ఎవరో బలమైన వారు ఉన్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ రంగంలోకి కొత్తగా దిగనున్న సీబీఐ టీమ్ ఏం తేలుస్తుందో అనే ఆసక్తి రేకెత్తిస్తోంది. తమ కుటుంబానికి జరిగిన అన్యాయంపై అలుపెరగని పోరాటం చేస్తున్న వివేకా కుమార్తె సునీతకు ఈసారైనా న్యాయం దక్కుతుందేమో చూడాలి.