విజయవాడ: సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎట్టకేలకు ఆదివారం విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్టిఆర్ బయోపిక్ గురించి మాట్లాడడంతో పాటు చంద్రబాబు మీద విమర్శలు చేశారు.
పోలీసుల సూచనల మేరకు వేదిక మార్చి ఫిలిమ్ చాంబర్ హాలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వర్మ మాట్లాడుతూ, బాబును నమ్మి ఎన్టిఆర్ నష్టపోయారని వ్యాఖ్యానించారు. ఎన్టిఆర్ను కష్టాలకు గురి చేసిన వ్యక్తికి ప్రజాకోర్టులో శిక్ష పడిందని వర్మ అన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వల్లే టిడిపి ఓటమిపాలయ్యిందనీ, ఇది చంద్రబాబు ఓటమి అని తాను భావిస్తున్నానీ వర్మ పేర్కొన్నారు. మొన్నటి ఎన్నికల్లో సైకిల్కు పంచర్ అయ్యిందని వర్మ ఎద్దేవా చేశారు. జనసేనతో పోల్చుకుంటే ప్రజారాజ్యం బాహుబలి అంటూ జనసేన కంటే ప్రజారాజ్యం 18 రెట్లు బలమైందని వర్మ అన్నారు.
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా గురించి వివరిస్తూ, ఈ సినిమా రాజకీయ అంశాలతో కూడుకున్నది కాదనీ అయినా సినిమా విడుదలకు ఆంధ్రప్రదేశ్లో అడ్డంకులు సృష్టించారని వర్మ ఆరోపించారు. గతంలో ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే అడ్డుకున్నారనీ, ఒక కీలక వ్యక్తి తనకు ఫోన్ చేసి వెనక్కు పంపించారని వర్మ చెప్పారు. ఆ కీలక వ్యక్తి పేరు తరువాత చెబుతానని వర్మ అన్నారు.
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో నిజం చెప్పడానికి ప్రయత్నించాననీ అది కొంత మందికి నచ్చలేదని వర్మ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 31న సినిమా రిలీజ్ చేస్తున్నామనీ, నిజాలేంటో ప్రజలకు తెలుస్తాయన్నారు..
తన తదుపరి చిత్రం టైటిల్ ‘కమ్మ రాజ్యంలో కడప రౌడీలు’ అని ప్రకటింతిన వర్మ వెంటనే, ‘సారీ’ కాదు ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అని సరి చేసుకున్నారు. ఈ టైటిల్ వివాదాస్పదం అయ్యే అవకాశం ఉందని ఒక విలేఖరి పేర్కొనగా ‘నాకు గిల్లడం అలవాటు’ అని వర్మ పేర్కొన్నారు. రెండు కులాల మధ్య వైరుద్యాలు ఏమీ రావనీ, ఆ కులాల వారు సామరస్యంగానే ఉన్నారని వర్మ చెప్పుకొచ్చారు. ఈ సమావేశంలో నిర్మాత రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.