Bjp : బీజేపీ Bjp ఏపీకి భారీగా నిధుల వరద పారింది. దీంతో జాతీయ రహదారులకు మహార్దశ పట్టనుంది. రాష్ట్రంలోని జాతీయ రహదారులకు వేల కోట్లు కేటాయిస్తూ కేంద్ర రోడ్లు, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు నిధులు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. మొత్తంగా ఏపీ, యూపీ రాష్ట్రాల్లో 5 హైవే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. ఏపీలో కంటకపల్లె-సబ్బవరం ఆరు లైన్ల జాతీయ రహదారికి 824.29 కోట్లు, కొర్లామ్-కంటకపల్లె సెక్షన్ లో ఆరు లేన్లకు 772.70 కోట్లు, అనంతపురం టౌన్ నేషనల్ హైవేపై నాలుగు లేన్ల రోడ్డు వెడల్పుకు 311.93 కోట్ల ప్రాజెక్టుకు గడ్కరీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మిగిలిన ప్రాజెక్టులు యూపీకి కేటాయించారు. ఏపీపై ప్రేమ చూపిస్తూ జాతీయ ప్రాజెక్టులకు నిధులు ఇచ్చారు. అయితే.. ఏపీపై నిజంగానే కేంద్రానికి ప్రేమ ఉందా? అంటే క్వశ్చన్ మార్కే.
ఏపీ అంటే లెక్క లేనట్టేనా..
రాష్ట్రాల అభివృద్ధిలో కేంద్రం పాత్ర చాలా కీలకం. జాతీయ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాల్సిందే. అయితే.. ఏపీపై కేంద్రానికి ఎప్పుడూ వ్యతిరేక చూపే అని చెప్పాలి. రాష్ట్రాల నుంచి కేంద్రం తీసుకునే పన్నుల వాటాలోనే తిరిగి రాష్ట్రాలకు ఇవ్వాలి. ఇక్కడ కూడా కేంద్రం పెద్దగా ఏపీ వైపు చూడదని చెప్పాలి. ప్రస్తుతం ఏపీ రాజధాని లేని రాష్ట్రం. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఏపీ ఉన్న స్థితిలో లేదు. ఉమ్మడి ఏపీ విభజనలో కాంగ్రెస్ కు ఎంత వాటా ఉందో బీజేపీకి అంతే ఉంది. ప్రధానిగా ఆనాడు మన్మోహన్ సింగ్ ఇచ్చిన వాగ్దానాలను ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ పెడచెవిన పెట్టింది. రెవెన్యూ లోటు అలానే ఉండిపోయింది. ప్రత్యేక హోదా పక్కకు వెళ్లిపోయింది. పోనీ.. ప్రత్యేక ప్యాకేజీ ఆశ చూపింది. ప్రత్యేకహోదాకు ఎలా చట్టం లేదో.. స్పెషల్ ప్యాకేజీకి లేదు. ఆ హామీ ఎలా పక్కకు వెళ్లిపోయిందో ఇదీ అంతే. ఇలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న సాయం అన్ని రాష్ట్రాలకు చేస్తున్నట్టే చేస్తోంది కానీ.. ఏపీ పరిస్థితిని బట్టి లేదన్నది వాస్తవం.
బీజేపీ అందుకే ఆలోచిస్తుందా..
ఏపీ రాజధాని అంశంలో తన వైఖరిపై స్పష్టత లేదు. ఆనాడు అమరావతికి శంకుస్థాపన చేసిందీ కేంద్ర ప్రభుత్వమే.. ఇప్పుడు మూడు రాజధానులు అంటున్నా ‘మీ ఇష్టం’ అంటోందీ కేంద్రమే. ప్రభుత్వ నిర్ణయాల్లో తల దూర్చితే ఏపీలో బలపడటం కష్టం అనే భావనలో కేంద్రం ఉందనేది వాస్తవం. అందుకే ఏపీ ఏ నిర్ణయం తీసుకుంటే.. అందులోని సాధకబాధల్ని చూసి స్పందించి ఏపీ ప్రజల్లోకి వెళ్లాలని ఒక ప్లాన్ గా అర్ధమవుతోంది. పోలవరం అంశంలో కూడా కేంద్రం పాత్ర ప్రత్యేకమే. జాతీయ హోదా ప్రాజెక్టుగా తీసుకుని మొదట ఖర్చు చేసిన మూడు వేల కోట్లు సంగతి పక్కకు వెళ్లిపోయింది. 2017 అంచనా వ్యయాల్ని కూడా భరించేందుకు సిద్ధంగా లేమని.. 2014 ప్రకారమే నిధులిస్తామని ప్రకటించడం ఏపీపై వ్యతిరేక భావన ఉందనే చెప్పాలి. ఇప్పుడు కొత్తగా విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై వెనక్కు వెళ్లేలా లేదు. నిన్నటి ప్రధాని కాన్ఫరెన్సే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది.
ప్రజల్లోకి వెళ్లాలంటే..
ఇవన్నీ ఏపీ ప్రజల్లో బీజేపీపై వ్యతిరేక అభిప్రాయం తీసుకొచ్చేవే. అందుకే.. ఏపీకి ఇంత చేస్తున్నాం అని చెప్పుకోవడానికి ఉన్నపళంగా వేల కోట్ల జాతీయ రహదారుల అభివృద్ధి మంత్రం జపిస్తోంది కేంద్రం. కర్ణాటక, తమిళనాడుల్లోని రాష్ట్ర రహదారులు కూడా ఎప్పుడో 4లేన్లు అయిపోయాయి. ఇప్పుడు ఏపీలో ఉన్న సమస్యలను పరిష్కరించలేక రహదారులకు నిధులు అంటూ ముందుకొచ్చారు. కానీ.. ఇవేమీ ఏపీ ప్రజలను కేంద్ర ప్రభుత్వం మెప్పించేదైతే కాదు. ఇవన్నీ కేంద్రం బాధ్యతగా చేసేది మాత్రమే. ప్రజలను గెలవాలన్నా.. ఏపీపై కేంద్రం సవతి ప్రేమ చూపడం లేదని నిరూపించుకోవాలన్నా.. ఏపీలో బీజేపీ పుంజుకోవాలన్నా.. ప్రజల సమస్యలపై దృష్టి సారించాలి. పోవలరం అంచనా వ్యయం భరించి, రాజధానిపై క్లారిటీ ఇచ్చి, విశాఖ ఉక్కు పరిశ్రమపై వెనక్కు వెళ్తామనే భరోసా ఇస్తేనే ప్రజల్లోకి.. వారి మనసుల్లోకి వెళ్లగలరు. ఇవేమీ వారికి తెలీనవి కాకపోయినా.. వాస్తవ పరిస్థితులకు తగ్గట్టు ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఏపీలో ఉందని గ్రహించాల్సిందే. ఇప్పటికే ఈ అంశాలపై ఏపీ ప్రజల్లో కేంద్రంపై ఉన్న అపోహలను తొలగించుకోవాలంటే కేంద్రం చేయాల్సింది ఇంకా చాలా ఉందనేది నిర్వివాదాంశం.