ఏపీలో వేగంగా జరుగుతున్న రాజకీయ, పరిపాలనా విషయాలను గమనిస్తున్న కేంద్ర ప్రభుత్వం..గవర్నర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకునున్నదని వార్తలు వస్తున్నాయి. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు, కానగరాజ్ నియామకం విషయంలో గవర్నర్ ఆమోదించిన ఆర్డినెన్స్ ను హైకోర్టు కొట్టి వేసిన విషయం తెలిసిందే. ఈ కీలకమైన ఆర్డినెన్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం, న్యాయ నిపుణులను సంప్రదించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అనుకుంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పొరపాటు గానో, అనాలోచితంగానో ఏదయినా బిల్లులను గానీ ఆర్డినెన్సు లను గవర్నర్ ఆమోదం కొరకు పంపితే..అవి చట్ట పరిధిలో లేకపోతే సవరణలు చేసి పంపాలని ప్రభుత్వానికి సూచిస్తూ ఫైల్ ను వెనక్కు పంపవచ్చు. ఆ అధికారం గవర్నర్ కు ఉంటుంది. ఎన్ టీ రామారావులో హయంలో గానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో గానీ అప్పటి గవర్నర్ లు పలు సందర్భాలలో చట్టపరిదిలో లేని ఫైల్ లను తిప్పి పంపిన సందర్భాలు ఉన్నాయి. సాధారణంగా కీలక విషయాల్లో గవర్నర్ నిర్ణయాలు తీసుకున్నారు అంటే కేంద్రం కు చెప్పే అనుమతి తీసుకొని ఉంటారని అందరూ అనుకుంటారు.
కానీ నిమ్మగడ్డ విషయంలో ప్రభుత్వం ఆవేశపూరితంగా తీసుకున్న నిర్ణయానికి గవర్నర్ ఓకే చెప్పడం, ఆ తరువాత కోర్టు ఆదేశాల మేరకు మళ్ళీ అయననే నియమించాల్సి రావడం, ఇటీవల సీఆర్డీఏ బిల్లు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులను గవర్నర్ ఆమోదించడం తెలిసిందే. ఒ పక్క రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుండగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కేంద్రాన్ని సంప్రదించకుండానే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఇది కేంద్రానికి తలనొప్పిగా మారుతోందట. ఈ నేపథ్యంలో గవర్నర్ బిశ్వభూషణ్ ను తప్పించి అయన స్థానంలో వేరే వారిని నియమించాలని కేంద్రంలోని బీజేపీ యోచన చేస్తుందని ప్రచారం జరుగుతోంది. అయన స్థానంలో పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ భేడీ పేరు తెరపైకి వస్తున్నది. గతంలో బిశ్వభూషణ్ హరిచందన్ నియామకం కంటే ముందు కూడా కిరణ్ భేడీ గవర్నర్ గా రానున్నారని ప్రచారం జరిగింది. జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఉందా లేదా అనేది తేలాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.