విశాఖ,ఫిబ్రవరి 27: మరో రెండు రోజుల్లో ప్రధానమంత్రి పర్యటన ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్ ప్రకటించి అందరిని ఆశ్చర్యం లోకి ముంచెత్తింది. ఒకటో తేదీ విశాఖలో స్వయంగా ప్రధానమంత్రి మోది రైల్వేజోన్ ప్రకటిస్తారని బిజెపి నేతలు భావించారు. వీరి ఊహలకు భిన్నంగా రెండు రోజుల ముందే బుధవారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ ఆంధ్రప్రదేశ్ కు కొత్త రైల్వే జోన్ ప్రకటించారు.
ప్రధానమంత్రి మోది వ్యూహాత్మకంగా వ్యవహరి స్తున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
కేంద్రంతో తెగతెంపులు చేసుకున్న అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలను నెరవేర్చడం లేదంటూ ధర్మ పోరాట దీక్ష పేరుతో కేంద్రంపై యుద్ధమే ప్రకటించారు. నిత్యం కేంద్రం తీరును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టిడిపి నేతలు విమర్శిస్తున్న ఈ తరుణంలో విశాఖ రైల్వే జోన్ ప్రకటించి కేంద్రం వ్యూహాత్మక ముందడుగు వేసింది.
ఎన్నికల నాటికి ప్రధాన మంత్రి మోది ఎటువంటివి వ్యూహాత్మక చర్యలు తీసుకుంటారో అన్న ఆసక్తి ప్రజల్లో నెలకొంటుంది.
సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కేంద్రం ఇటీవలే అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్ కల్పించడం, మరోవైపు ఐదెకరాల లోపు ఉన్న రైతాంగానికి పెట్టుబడి సాయం గా ఏడాదికి ఆరు వేలు ప్రకటించడం తెలిసిందే.
విశాఖ జోన్ వివరాలు. .
విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ పని చేస్తుంది. సౌత్ కోస్ట్ రైల్వే పేరుతో కొత్త జోన్ ఉండనుంది- ఎస్ఈవోఆర్ గా ఈ జోన్ ను పిలుస్తారు-
గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లు ఈ జోన్ పరిధిలో ఉంటాయి- వాల్తేర్ డివిజన్ ను రెండు భాగాలుగా విభజించారు. ఒక భాగం సౌత్ కోస్ట్ రైల్వేలోని విజయవాడ డివిజన్ గా ఉంటుంది- మిగిలిన భాగాన్ని రాయగఢ కేంద్రంగా కొత్త డివిజన్ గా ఉంటుంది- సౌత్ సెంట్రల్ రైల్వే హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్ డివిజన్లతో కొనసాగుతుంది- రైల్వే బోర్డుతో చర్చించి మిగిలిన నిబంధనలు రూపొందించడం జరుగుతుందని మంత్రి ప్రకటించారు. రైల్వే జోన్ పై ఈ రోజే నిర్ణయం తీసుకున్నారు.