కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తున్నాయి. రైతులు రోడ్డెక్కితే ఏం జరుగుతుందో చూపిస్తున్నారు. 29 రాష్ట్రాల్లో కేవలం రెండు రాష్ట్రాల రైతులు రోడ్డెక్కి తెలుపుతున్న నిరసనలకు దేశం యావత్తు మద్దతిస్తోంది. ఎన్డీఏ కార్పొరేట్ పక్షపాతి అని 2014లోనే ముద్ర పడింది. దానిని ఎందుకు పోగొట్టుకోవడం అని ఆలోచిస్తున్నట్టుంది. రైతుల కోసం కొత్త చట్టాలు తెచ్చింది. విచిత్రం.. చట్ట సభల్లో ఏ పార్టీలయితే వ్యవసాయ బిల్లుకు మద్దతిచ్చాయో అవే పార్టీలు ఇప్పుడు వ్యతిరేకిస్తున్నాయి. పూర్తిగా వ్యతిరేకం కాకపోయినా.. రైతుల పక్షానే మేము అని చిలక పలుకులు పలకుతున్నాయి.
ఎవరి పంతం వారిదే..
అన్నదాతలం.. మా క్షేమం చూడకపోతే ఎలా అని రైతులు.. మీకోసమే ఇదంతా అంటూ కేంద్రం ఎక్కిన మెట్టు మీదనే కూర్చున్నారు. దీంతో ఈనెల 8న భారత్ బంద్ కు పిలుపిచ్చాయి రైతు సంఘాలు. దేశం మొత్తం ఈ బంద్ పాటించాయి. అయితే.. మద్దతిచ్చిన పార్టీలు ఎందుకు ఇప్పుడు వ్యతిరేకిస్తున్నాయో అర్ధం కాని పరిస్థితి. కేంద్రం ఏదొకటి చేసి తమ పంతం నెగ్గించుకోవడానికి ఇది రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులు కాదు. ఉద్యమం. దీనిని ఎలా అణచాలో అర్ధం కాని పరిస్థితుల్లో కేంద్రం ఉంది. అయితే.. పంజాబ్ రైతులకు మద్ధతిస్తూ ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న పంజాబ్ కిసాన్ యూనియన్ 2008 తమ పంటలకు కార్పొరేట్లు కొనుగోలు చేసే చట్టం చేయాలని యూపీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పుడదే బిల్లును ఎన్డీఏ చేస్తోంది కదా అని అంటున్నారు కొందరు. ఇదే నిజమే.
బీజేపీలోనే సందిగ్దం..
నిజానికి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ బిల్లుకు వ్యతిరేకత రాకూడదు. కానీ.. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ చౌహాన్.. ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. మా రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల గింజను కూడా అమ్మనీయం. వస్తే ట్రక్కులు సీజ్ చేస్తాం అంటున్నారు. దీంతో స్వయంపాలిత రాష్ట్రంలోనే వ్యతిరేకత వస్తోంది. కానీ.. కేంద్రంలో మాత్రం మెట్టు దిగటం లేదు. ఢిల్లీలో నిరసన చేస్తున్న రైతులకు అన్నపానీయాలు ఇస్తున్న ఆప్ కూడా పార్లమెంట్ లో ఈ బిల్లుకు మద్దతిచ్చింది. ఏపీ తరపున విజయసాయి రెడ్డి మద్దతిచ్చారు. మద్దతివ్వని వారు దళారులు అన్నారు కూడా. బీజేపీ సాగిలపడటానికి అర్రులు చాస్తున్న టీడీపీ కూడా మద్దతిచ్చింది.. కొన్ని సవరణలతో.. ప్రతిపక్షంలో ఉంది కాబట్టి. ఈ పార్టీలు కూడా మొన్నటి భారత్ బంద్ లో రైతుల వైపు నిలబడక తప్పలేదు.
కేంద్రానికి షాక్ తప్పదా..?
పరిస్థితి చూస్తుంటే.. 2008లో కార్పొరేట్ అమ్మకాలు కావాలన్న రైతులు ఇప్పుడెందుకు వద్దంటున్నారో.. రైతులు వద్దంటున్నా ఎన్డీఏ ఎందుకు బెట్టు చేస్తుందో.. పార్లమెంటులో మద్దతిచ్చిన పార్టీలు 8న యూటర్న్ ఎందుకు తీసుకున్నాయో ఎవరికీ అర్ధం కానిది. బంద్ జరిగింది. మళ్లీ 14న మరో మహోద్యమానికి సిద్ధమయ్యారు రైతులు. ఈ నేపథ్యంలో మరి రైతుల తరపున నిజంగా నిలబడే రాజకీయ పార్టీలు ఏవీ.. అంటే ఎవరూ సమాధానం చెప్పే పరిస్థితి లేదు. పరిస్థితులకు అనుగుణంగా మారిపోవడం తప్ప. మరి ఈ యుద్ధంలో గెలపు రైతులదా.. ప్రభుత్వానిదా చూడాలి. పంచ్ లైన్ గా చెప్పాలంటే.. రైతులతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో రాష్ట్రాల్లోని పార్టీలకు తెలిసినట్టు ఇంకా కేంద్రానికి తెలిసినట్టు లేదు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?