గత వారం రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా కురుస్తున్న వర్షాలతో పలు చోట్ల వరదలు పొటెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో భారీ వర్షాలు సృష్టిస్తున్న భీభత్సం అంతా ఇంతా కాదు. ఇప్పటికే నగరంలోని చాలా బస్తీలు, కాలనీలు జమయమయ్యాయి. భాగ్యనగరం నడిబొడ్డున్న ఉన్న హుస్సేన్ సాగర్ సైతం భారీ వర్షాలు, వరదలతో పొంగి పొర్లుతున్నది. చంద్రాయన్ గుట్ట చేరువుతో పాటు బాలాపూర్ గుర్రం చెరువు కట్టలు తెగిపోవడంతో ఆయా ప్రాంతాల్లోని ఇండ్లు నీటమునిగిపోయాయి. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
కాగా, తాజాగా పోటెత్తుతున్న వరద నీటిలో మృత దేహాలు కొట్టుకు రావడం హైదరాబాద్ సిటీలో వానలు సృష్టించిన విలయతాండవానికి అద్దం పడుతున్నది. మరోవైపు పలు చోట్ల ఇండ్లు పూర్తిగా నీటమునగడంతో.. ప్రజలు వాటిని వదిలి పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. ఇప్పటికే ఇండ్లల్లోని వస్తువులు, సరుకులు వరద నీటిలో నాని పాడయ్యాయి. ఈ నేపథ్యంలోనే పలు ప్రాంతాల్లో విద్యార్థుల సర్టిఫికెట్లు నీటిపై తేలుతూ.. వరదలో కొట్టుకుపోవడం కనిపించింది.
వరద నీటిలో విద్యార్థుల సర్టిఫికెట్స్ కొట్టుకుపోతుండటంతో ఇటు విద్యార్థుల అటు తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్త మవుతున్నది. చాలా ప్రాంతాల్లో సైతం ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ విషయమై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపట్ల విద్యాశాఖ అధికారులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తూ.. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి గురించి మంత్రికి వివరించారు.
దీనిపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి తాజాగా స్పందించారు. భారీ వర్షాలు , వరదల కారణంగా సర్టిఫికెట్లు కోల్పోయిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురికావద్దనీ, ప్రస్తుతం ఎదురైన సమస్యలకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుటుందని తెలిపారు. సర్టిఫికెట్లు కోల్పోయిన ప్రతిఒక్కరూ అధికారులకు తెలియజేయాలని చెప్పారు. ప్రస్తుతం సర్టిఫికెట్లు కోల్పోయనప్పటికీ.. ఈ విషయాన్ని వెల్లడిస్తూ దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికీ కొత్తగా సర్టిఫికెట్లు జారీ చేస్తామని తెలిపారు. అందరూ జాగ్రత్తగా, మనోధైర్యంతో ఉండాలనీ, ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందనీ మరో సారి స్పష్టం చేస్తూ భరోసా కల్పించారు.