Visakha Steel Plant: ఏదైనా సమస్య వస్తే దాన్ని పరిష్కరించడానికి అనేక మార్గాలు ఉంటాయి. ఆ సమస్యను రాజకీయం చేయడానికి ఇంకా ఎక్కువ మార్గాలు ఉంటాయి. అలా రాజకీయం చేయడంలో చంద్రబాబు దిట్ట. రాజకీయ సమస్యలను పరిష్కరించడం కంటే తప్పించుకోవడంలో కూడా ఆయనది అందె వేసిన చేయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో తాజాగా చంద్రబాబు పెట్టిన మెలిక ఆయన అనుభవానికి, ఇన్నాళ్లు ఆయన చేసిన రాజకీయానికి ఓ మచ్చుతునక. ఏపి రాజకీయాల్లో వివాదాస్పదంగా మారి మూడు జిల్లాల భవిష్యత్తును శాశిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో స్పందించిన చంద్రబాబు జగన్ ప్రభుత్వానికే ఇరుకున పెట్టేలా తన అనుభవాన్ని ప్రదర్శించారు.
ఏపి రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్
ఏపిలో మొదటి నుండి వైసీపీ, టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రయోజనాల విషయంలోనూ తమిళనాడు తరహాలో ఉమ్మడిగా పోరాటాలు చేసిన దాఖలాలు లేవు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏ ఒక్క ప్రధాన సమస్యపైనా అఖిలపక్ష మీటింగ్ జరగలేదు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై అన్ని రాజకీయ పక్షాలు ఒకే మాట మీదకు వస్తున్నాయి. విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు నినాదంతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్రం ప్రైవేటీకరణ చేయడానికి సన్నాహాలు చేస్తుండటంతో కార్మిక లోకం భగ్గుమంది.
Visakha Steel Plant: ‘గంటా’ దారిలోనే అందరూ?
ఆ ప్రతిపాదన వచ్చిన నాటి నుండి కార్మికులు పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు, ప్రదర్శనలు, ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. కార్మికుల ఆంధోళనకు వివిధ రాజకీయ పక్షాలు మద్దతు తెలియజేస్తున్నాయి. మాజీ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనను నిరసిస్తూ శాసనసభ్యత్వానికి రాజీనామా కూడా చేశారు. కానీ ఇంత వరకూ ఇతర ప్రజా ప్రతినిధులు రాజీనామాలకు ఇంకా సిద్ధం కాలేదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అధికార వైసీపీతో సహా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వ్యతిరేకిస్తున్నా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు తప్పితే ఐక్య ఉద్యమానికి బాటలు వేయలేదు.
చంద్రబాబు సంచలన ప్రకటన
తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకువచ్చిన ప్రతిపాదన రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద సంచలనం అవుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని సీఎం జగన్ ముందు ఉండి నడిపించాలని కోరారు. ఐక్య పోరాటం ద్వారానే ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించకుండా కాపాడుకోగలమని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం టీడీపీ నుండి ఎన్నికైన ప్రజా ప్రతినిధులు అంతా రాజీనామాకు సిద్ధమని చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ లేఖ రాసిన చంద్రబాబు ఈ కీలక ప్రతిపాదన చేయడం విశేషం. చంద్రబాబు ప్రతిపాదనపై సీఎం జగన్ ఏమంటారో చూడాలి మరి.