TDP: టీడీపీ TDP 2019 ఎన్నికల్లో ఎదురైన పరాభవం నుంచి తేరుకుందా.. లేదా అనేది పక్కనపెడితే ప్రతిపక్షంలో ఉండి ప్రజల్లోకి వెళ్లాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వ పథకాలతో దూసుకుపోతోంది. ఖర్చులకు వెనుకాడకుండా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ముందుకెళ్తోంది. ప్రస్తుతం ఈ రెండు పార్టీలు ఎవరి పనుల్లో వారు బిజీగానే ఉన్నా స్వతహాగా అధికారంలో ఉన్న పార్టీకి బలం ఎక్కువ. ఈ క్రమంలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ప్రజా సమస్యలపై పోరాడటం గతంలో ఉండేది. కానీ.. ఇప్పుడు రోజులు మారాయి. ప్రతిపక్షంలో ఉంటూ పార్టీ ఉనికితోపాటు.. పార్టీలోని వారిని కాపాడుకునే పని ఎక్కువైంది. ఇందుకు ప్రజల్లోకి దూకుడుగా వెళ్తున్నామని చెప్పుకునే క్రమంలో తమను తాము హైలైట్ కావడం. ఇప్పుడు చంద్రబాబు, లోకేశ్ చేస్తోంది అదే అని చెప్పాలి.
వైసీపీలో ఇలా..
వైసీపీ ప్రభుత్వంలో మంత్రులు, పార్టీలోని ఎమ్మెల్యేల్లో దూకుడు స్వభావం ఉన్నవారు ఎక్కువ. వీరిలో మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ ముందు వరుసలో నిలుస్తారు. తమదైన మాట తీరు, వాగ్దాటితో టీడీపీని, చంద్రబాబు, లోకేశ్ ను ఓ ఆట ఆడుకుంటూ ఉంటారు. ప్రతిపక్షంలో ఉండగా వీరు ఎదుర్కొన్న పరిస్థితులకు తగ్గట్టుగా వీరి వాగ్దాటి ఉందా అనే అనుమానాలు ఉన్నాయి. బొత్స, పెద్దిరెడ్డి, కన్నబాబు, పేర్ని నాని.. వంటి నాయకులు సైలెంట్ గా సెటైర్లు వేస్తూ టీడీపీని ఇరుకున పెడుతూంటారు. ఎమ్మెల్యేల్లో అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాధ్.. ఇలా చాలామంది తమదైన వాగ్భాణాలు సంధిస్తూ ఉంటారు. అయితే.. వీరికి ధీటుగా తెలుగుదేశం నుంచి కామెంట్లు చేసేవాళ్లు తక్కువమందే ఉన్నారు. స్వతహాగా ప్రతిపక్షంలో ఉన్నామని కూడా అంతటి దూకుడైతే ప్రదర్శించడం లేదు. అయితే.. ఈమధ్య టీడీపీ నేతలు కూడా స్పీడు పెంచారు. అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య, పట్టాభి.. వంటి వారు తమదైన దూకుడుతో ముందుకు వెళ్తున్నారు.
గతం కంటే భిన్నంగా చంద్రబాబు, లోకేశ్..
అయితే.. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు, లోకేశ్ కూడా తమ వాదనల్లో పదును పెంచుతున్నారు. ఇటివల కొన్ని సందర్భాల్లో చంద్రబాబు కూడా అదుపుతప్పి.. ‘అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అన్నారు.. ఏం పీకారు’ అన్నారు. జగన్ ను కూడా వాడు.. వీడు అంటున్నారని సజ్జల కూడా ఇటివల ప్రెస్ మీట్లో చెప్పారు. వైసీపీ మంత్రులను దుర్మార్గులు.. అంటూ కూడా సంబోధిస్తున్నారు. లోకేశ్ కూడా రాజకీయం మొదలెట్టేశారు. ఇటివల ప్రభుత్వ పథకాలపై వైసీపీ మంత్రలు పలు వ్యాఖ్యలు చేస్తున్నారంటూ.. ‘నీ అబ్బ సొత్తా.. మీ భాషలోనే చెప్పాలంటే.. నీ అమ్మ మొగుడి సొత్తా ఇది’ అంటూ ఫైర్ అయ్యారు. టీడీపీ నాయకుల్లో అచ్చెన్నాయుడు కూడా ‘మేము అధికారంలోకి రాగానే చంద్రబాబు గారిని అడిగి హోంశాఖ తీసుకుని మీ సంగతి చూస్తా’ అన్నారు. ఇలా తమ వాదనల్లో పదును పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మొత్తంగా అధికార, ప్రతిపక్షాల వాదనలు వ్యక్తిగత దూషణలుగా మారిపోతున్నాయి. ఇటివల ముగిసిన పంచాయతీ, త్వరలో జరుగనున్న మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో కూడా నాయకులు తమ వాగ్దాటిని పెంచుతున్నారు. ఈ క్రమంలో అనేక మాటలు వస్తున్నాయి.
పార్టీలో ఉత్సాహం నింపేందుకేనా..
ఇక్కడ టీడీపీ నాయకులు వాదనల్లో ఇటివల ఇంత దూకుడు పెరగడానికి కూడా కారణం లేకపోలేదు. కార్యకర్తల్లో ఉత్సాహం, ధైర్యం నింపేందుకు కూడా ఇలా దూకుడు పెంచారని చెప్పాలి. గతం కంటే భిన్నంగా చంద్రబాబు అండ్ టీమ్ లో దూకుడు పెరిగింది. ముఖ్యంగా లోకేశ్ నుంచి కూడా ఇటువంటి మాటలు వస్తున్నాయి. ఇవన్నీ పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు.. వైసీపీని ఎదుర్కొనేందుకు అనేది చాలా చిన్న లాజిక్ అని చెప్పాలి. 2024లో జరిగే ఎన్నికల వరకూ పార్టీ శ్రేణులు ఉత్తేజంగా ఉండాలంటే టీడీపీకి ఇలా తప్పని పరిస్థితి వచ్చిందనే చెప్పాలి. ఇంకా టీడీపీలో పైర్ బ్రాండులు ఉన్నా ప్రస్తుతం ఎవరూ మాట్లాడటం లేదు. చింతమనేని వంటి వారు కూడా గతంలో ఉన్న దూకుడుతో ఉండటం లేదు. కొత్త తలనొప్పులు కోరి తెచ్చుకోలేక. ఏమైతేనేం.. ఎన్నికల్లో గెలిచేది మేమే.. అని బుద్దా వెంకన్న తొడగొట్టారు. ఓడిపోయాక.. పార్టీ శ్రేణుల్ని ఉత్తేజంగా ఉంచేందుకు అలా చేశానన్నారు. ప్రస్తుతం చంద్రబాబు, లోకేశ్, అచ్చెన్నాయుడు.. వంటి నాయకులు కూడా ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారని చెప్పాలి.