విశాఖ: తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఉత్తరాంధ్ర పర్యటనకు బ్రేక్ పడింది. సి ఆర్ పీ సి 151 సెక్షన్ కింద పోలీసులు చంద్రబాబును అదుపులోకి తీసుకుని ఎయిర్ పోర్ట్ లోని వీఐపీ లాంజ్లోకి తరలించారు. పరిస్థితులు అదుపులోకి వచ్చేంత వరకు ఆయన్ను నిర్బంధింలోనే ఉంచాలని లేకుంటే హైదరాబాద్ తరలించాలన్న ఆలోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబుతో పాటు ఉన్న టీడీపీ నేతలను, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉదయం నుంచి ఎయిర్పోర్టు వద్ద హైడ్రామా చోటుచేసుకున్నది.
ఉత్తరాంధ్ర ప్రజా చైతన్య యాత్రలో భాగంగా విజయనగరం జిల్లా వెళ్లేందుకు ఈ ఉదయం చంద్రబాబు విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు ఎయిర్ పోర్టు వద్దకు తరలివచ్చారు. మరోవైపు వైసీపీ శ్రేణులు, ప్రజాసంఘాల నాయకులు, మహిళలు కూడా తరలివచ్చి చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కు చంద్రబాబు మద్దతు తెలపాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ చంద్రబాబు కాన్వాయ్ను అడ్డుకున్నారు.
ఉత్తరాంధ్ర ద్రోహి చంద్రబాబు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. చంద్రబాబు కాన్వాయ్ ని అడ్డుకున్న నిరసనకారులు..ఎట్టి పరిస్థితుల్లోనూ కాన్వాయ్ను కదలనివ్వమంటూ ఆందోళన చేశారు. ఎంతసేపటికీ కాన్వాయ్ను కదలనివ్వకపోవడంతో కారు దిగేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. నిరసనకారులు అడ్డుకోవడంతో తిరిగి కారులోనే ఆయన కూర్చోన్నారు. గత ఐదేళ్లలో ఉత్తరాంధ్రకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణకు చంద్రబాబు మద్దతు తెలిపాలని.. లేదంటే ఉత్తరాంధ్రలో అడ్డుపెట్టనివ్వమని హెచ్చరించారు. చంద్రబాబుకు అనుకూలంగా టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. పోటా పోటీ నినాదాలతో వాతావరణ ఒక్కసారిగా వేడెక్కింది. చంద్రబాబు కాన్వాయ్పై కొందరు కోడిగుడ్లు, టమోటాలతో దాడి చేశారు. ఈ పరిణామంతో చంద్రబాబు వాహనంలోనే ఉండి పోయారు. ఒక దశలో చంద్రబాబు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించారు.
తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో చంద్రబాబు ను ఎయిర్ పోర్టు విఐపీ లాంచీకి తరలించిన పోలీసులు 151సెక్షన్ కింద నోటీస్ అందజేసి అదుపులోకి తీసుకున్నారు. యాత్రకు అనుమతి ఉంటే ఎందుకు అడ్డుకున్నారని చంద్రబాబు పోలీస్ అధికారులపై ఫైర్ అయ్యారు.
‘ఇది శాంతి భద్రతల వైఫల్యం కాదా?, పోలీసులు ఏం సమాధానం చెబుతారు?, ఇవాళ ఎంత సమయమైనా.. విశాఖలో పర్యటన కొనసాగించి తీరుతా. ఎయిర్పోర్టు ముందు వైసీపీ గూండాలు గుమికూడితే.. ఏమీ చేయలేక పోలీసులు చేతులెత్తేస్తారా?, ఎట్టి పరిస్థితుల్లోనూ యాత్ర కొనసాగిస్తా. నన్ను ఎన్కౌంటర్ చేసినా వెనక్కి తగ్గను’ అని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు ఎయిర్ పోర్టు విఐపీ లంచ్ లోనే ఉండిపోయారు. విషయం తెలుసుకున్న చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి విశాఖ ఎయిర్ పోర్టు కు బయలుదేరి వెళ్లారు. చంద్రబాబు పర్యటనను అధికారపార్టీ అడ్డుకుందని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తుండగా, ఉత్తరాంధ్ర ప్రజానీకమే చంద్రబాబుపై ఆగ్రహంతో అడ్డుకున్నారని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు.