రాజమహేంద్రవరం, జనవరి 27: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిసిల మద్దతుతో 150కన్నా ఎక్కువ సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు చెప్పారు. ఆదివారం రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కాలేజి మైదానంలో ‘జయహో బిసి’ సభలో ఆయన మాట్లాడుతూ, టిడిపిని కాపాడుకుంటూ వచ్చింది బిసీలేనని అన్నారు. అసెంబ్లీ సీట్లతోపాటు అన్ని పార్లమెంట్ స్థానాలను టిడిపి గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఎన్నికలకు ముందు బిసిలకు ముఖ్యమంత్రి వరాల జల్లు కురిపించారు. బిసి నేతలను ఢిల్లీకి పంపించిన ఘనత టిడిపిదే అని ఆయన చెప్పారు. ప్రతి బిసి ఇంటిపై ‘పచ్చ’ జెండా రెపరెపలాడాలని ఆయన కోరారు. బిసిలకు సబ్ ప్లాన్ తీసుకువచ్చి చట్టబద్ధత కల్పిస్తామన్నారు. దేశంలో మరెక్కడా బిసిలకు సబ్ ప్లాన్ లేదని ఆయన చెప్పారు. చేతివృత్తులు, కులవృత్తులను ఆదరిస్తామని ఆయన చెప్పారు. చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు మిమ్మల్ని ఆదరిస్తా. చేయూతనిస్తా అని అయన అన్నారు.
బిసిలకు 27శాతం రిజర్వేషన్లు ఇచ్చామనీ, నేతన్నలకు 111 కోట్ల రూపాయల మేర రుణమాఫీ చేశామనీ తెలిపారు. బిసిని టిటిడి చైర్మన్గా నియమిస్తే చులకనగా మాట్లాడారని ఆయన అన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఎనిమిది మంది బిసిలు ఉన్నారని ఆయన చెప్పారు.
బిసి ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అదేవిధంగా పలు బిసి కులాలకు సంబంధించి కార్పొరేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు.
గొర్రెలకు బీమా చేయడమేకాకుండా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని ఆయన తెలిపారు. బిసిలు నడిపే చేతివృత్తుల షాపుల్లో 150 యూనిట్లు కరెంటును ఉచింతంగా అందజేస్తామని ఆయన ప్రకటించారు.
బిజెపి, వైసిపిలు విభజించి పాలించేందుకు కుట్రలు చేస్తున్నారనీ, బిసిలను అణచివేసేందుకు రాజకీయాలు చేస్తున్నారనీ ఆయన ఆరోపించారు. ఫెడరల్ ఫ్రంట్ కాదు అది జగన్- మోదీ ఫ్రంట్ అని ఆయన అన్నారు.
వైసిపి, బిజెపి విమర్శ
‘జయహో బిసి’ సభపై వైఎస్పార్ కాంగ్రెస్, భారతీయ జనతాపార్టీ నేతలు మండిపడ్డారు. ఎన్నికలకు ముందు మాత్రమే చంద్రబాబుకు బిసిలు గుర్తుకు వస్తారంటూ వైసిపి అధికార ప్రతినిధి పార్ధసారధి విమర్శించారు. జయహో సభకు డ్వాక్రా మహిళలు రాకుంటే నగదు ఇవ్వబోమంటూ బెదిరించారని ఆయన ఆరోపించారు. బిసిలను ఓటు బ్యాంకుగానే టిడిపి చూస్తోందనీ, గత ఎన్నికల ముందు బిసిలకు ఇచ్చిన హామీలను అమలు చేశామని ముఖ్యమంత్రి చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు మాయలో బిసిలు పడవద్దని ఆయన కోరారు. వైసిపి అధినేత వైఎస్ జగన్తోనే బిసిల అభ్యున్నతి సాధ్యమని ఆయన అన్నారు.
తెలుగుదేశం ప్రభుత్వం గత నాలుగున్నర ఏళ్ల నుంచి బిసిలను వంచించిందని బిజెపి ఎంపి జివిఎల్ నరసింహారావు అన్నారు. హైకోర్టు జడ్జీలుగా బిసిలు పనికిరారంటూ చంద్రబాబు కుట్రపన్నారని ఆయన ట్వీట్ చేశారు. ‘ఆదరణ’ పథకం పేరుతో ముఖ్యమంత్రి అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. కేంద్రం మంజూరు చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయలేదని ఆయన చెప్పారు.