రాష్ట్ర రాజకీయలపై టీడీపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇందుకు తగ్గట్టే చంద్రబాబు కూడా జోశ్యం చెప్పడం ప్రారంభించారు. జమిలీ ఎన్నికలు వచ్చేస్తాయి.. కార్యకర్తలు సిద్ధంగా ఉండండి.. అధికారం మనదే.. అంటూ వ్యాఖ్యలు చేస్తుంటే తెలుగు తమ్ముళ్లను ఉత్సాహపడిపోతున్నారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం భావిస్తున్న నేపథ్యంలో టీడీపీ అప్రమత్తమవుతోంది. 2019 ఎన్నికల ఓటమి నుంచి టీడీపీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. పార్టీ పునఃనిర్మాణం దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు అధ్యక్షులను, రాష్ట్ర కార్యవర్గాన్ని సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడి ఎన్నిక కూడా లాంఛనమే!
జగన్ దూకుడును అడ్డుకోవడం సాధ్యమేనా..?
రాష్ట్ర రాజకీయాల్లో దశాబ్దాలుగా లేని పరిణామాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. టీడీపీ ఏమాత్రం బలం లేని స్థానాలు వచ్చాయి. సీఎం జగన్ అక్కడి నుంచి కూడా నాయకులను లాగేస్తున్నారు. పార్టీలోకి అధికారికంగా చేర్చుకోకపోయినా టీడీపీ నుంచి దూరం చేస్తున్నారు. చంద్రబాబును, పార్టీలోనూ నైరాశ్యాన్ని నింపి టీడీపీని బలహీనం చేయడమే జగన్ వ్యూహం కావొచ్చు. ఈ దెబ్బలను తట్టుకుని పార్టీలో పని చేయాలని భావిస్తున్న కార్యకర్తలకు ఏ ఎమ్మెల్యే ఎప్పుడు వెళ్లిపోతాడో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు. గతంలో టీడీపీ ఎమ్మెల్యేలు అక్రమాలకు పాల్పడ్డారని, వారి అవినీతిని వెలికితీసి కేసులు పెట్టేందుకు సిద్ధమవుతోంది ప్రభుత్వం. దీంతో వారి పాపాలను కడుక్కునేందుకు అధికార పార్టీకి జై కొడుతున్నారు.
ఊకదంపుడు మాటలతో ఎన్నాళ్లు బాబూ..!
‘నాయకులు రావడం, పోవడం సహజం.. నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ టీడీపీ’ అని చంద్రబాబు ఎప్పుడూ అంటూ ఉంటారు. ఓపక్క ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్నా కార్యకర్తలు చెదరకుండా మాటలు చెప్తారు తప్ప ప్రత్యామ్నాయ నాయకులను సిద్ధం చేయరు. ఇందుకు చీరాల, దర్శి, గన్నవరం, గుంటూరు పశ్చిమ.. లను ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అక్కడ నియోజకవర్గ ఇన్ చార్జిలు కూడా లేరు. కార్యకర్తలకు పెద్ద దిక్కు లేదు. వైసీపీ ఎమ్మెల్యేలున్న దాదాపు ముప్పై నియోజకవర్గాల్లో టీడీపీ పరిస్థితి ఇంతే. టీడీపీ ఓ ఫ్యాక్టరీ అని కబుర్లు చెప్పే చంద్రబాబు.. పై నియోజకవర్గాల్లో మాత్రం నేతలను తయారు చేయలేదు. ఈ ఊకదంపుడు మాటలే కొంప ముంచుతున్నాయని పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.