Chandrababu Naidu.. అధికారంలో ఉన్నప్పుడు ఒన్ మ్యాన్ షో చేసి.. ఇప్పుడు పార్టీలో సింగిల్ పర్సన్ షో అయిపోయారని చెప్పాలి. దీనంతటికీ కారణం కూడా ఒక విధంగా ఆయనే. ‘ఏరు దాటే వరకూ ఏటి మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న’ అనే సామెత చందాన చంద్రబాబు తీరు ఉంటుంది. జనసేన-బీజేపీతో చెలిమితో 2014లో అధికారం దక్కించుకుని.. మూడేళ్ల తర్వాత వారిద్దరినీ పక్కకు తోసేశారు. అంతా నాదే.. నేను మాత్రమే.. మీరెంత.. అన్న చంద్రబాబు తీరు ఆయనకే కాదు పార్టీకి కూడా చేటు తెచ్చింది. 2019 ఎన్నికల్లో పార్టీ చరిత్రలోనే లేనంత దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. రెండేళ్లవుతున్నా ఆ గాయం మానలేదు కదా.. పెద్దది అవుతూనే ఉంది. ఇప్పుడు దీనిపై కారం చల్లుకుంటూ పార్టీ నేతలే పార్టీకి మంట పెట్టుకుంటున్నారు.
విజయవాడలో టీడీపీ తీరు..
2014-2019 మధ్య అధికారం ఉన్న సమయంలో విజయవాడ కేంద్రంగానే చక్రం తిప్పిన చంద్రబాబుకు ఇప్పుడు అదే నగరం చక్రవ్యూహంలో పడేస్తోంది. క్యాడర్ కూడా కాలర్ ఎగరేసే విజయవాడలో నాయకులు గురించి చెప్పే పని లేదు. ఆ ఊరికి ఉన్న పవర్ అలాంటిది. ఇక్కడే టీడీపీ అగ్రనేతలు మాటల యుద్ధంతో పొగలు కక్కుతున్నారు. ‘నా ఏరియాలోకి వచ్చే హక్కు ఆయనకెక్కడుంది. నాకు తెలీకుండా అభ్యర్ధిని నిలబెడితే సహించేది లేదు. వేరే పార్టీ నుంచి వచ్చి ఇక్కడ పెత్తనం సాగిస్తే సహించేది లేదు’ అని బుద్దా వెంకన్న అంటుంటే.. ‘ఒకరితో నాకు పని లేదు.. నేను ఎవరి మాటా వినాల్సిన అవసరం లేదు. 8 మంది ఓడిపోయిన చోట నన్ను ఎంపీగా ప్రజలు గెలిపించారు.. ఇక్కడ ప్రజలందరి సమస్యలపై పోరాడే హక్కు నాకుంది.. ప్రజా సమస్యలు తెలుసుకునే హక్కు నాకుంది. ఇక్కడ రోడ్లు బాగోకపోతే నా పార్లమెంట్ ఫండ్స్ తో రోడ్లు వేయించాను. సీఎం జగన్ కానీ.. చంద్రబాబు కానీ వేయించలేదు. ఏసీ గదుల్లో కూర్చునే నాయకుడిని కాదు నేను’ అని కేశినేని నాని అంటున్నారు.
Chandrababu Naidu చంద్రబాబు పరిస్థితేంటో..
చంద్రబాబుకు ప్రస్తుతం ఏపీలో ఎదురీదుతున్నారు. పార్టీ నుంచి వెళ్లిపోయిన వారు.. వెళ్లడానికి సిద్ధంగా ఉన్నవారితో దిక్కుతోచకుండా ఉన్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సొంతంగా బాకా ఊదుకోవడం తప్ప చేస్తుంది ఏమీ లేదు. వైసీపీ హవా కొనసాగడం, జనసేన పుంజుకోవడం.. టీడీపీ చతికిలపడటం ఆయన్ను కలచివేస్తోంది. రోజూ ప్రెస్ మీట్లు, టెలిఫోన్ కాన్ఫరెన్సులతో ఊపిరాడకుండా ఆయన ఉంటే.. విజయవాడ తెలుగుదేశం ఊపిరాడకుండా చేస్తోంది. తాను పట్టించుకోకపోతే పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి ఏం జరగని పరిస్థితుల్లో.. విజయవాడ పంచాయితీని కూడా ఆయనే తీర్చాల్సి వస్తోంది. కానీ.. ప్రస్తుతం ఆయన మాట వినే పరిస్థితుల్లో ఎవరూ లేరు. కుమ్ములాటలతో టీడీపీ పరువు ఇంకా రోడ్డున పడుతోంది. అందుకే బాహాటంగానే జరుగుతున్న విజయవాడ టీడీపీ రగడపై చంద్రబాబే కాదు.. పార్టీ కూడా ఏం మాట్లాడలేకపోతోంది. వీరిద్దరినీ పార్టీ ఆఫీస్ పిలిపించి మాట్లాడారనే వార్తలు వస్తున్నా.. రెండు రోజులుగా మళ్లీ మాటల తూటాలతో రగులుతున్న నాయకుల తీరు చంద్రబాబు మాటను పట్టించుకునేలా లేదు.
చంద్రబాబుకు అటు పంచాయతీ.. ఇటు పంచాయితీ..
చంద్రబాబు తీరే ప్రస్తుత పార్టీ పరిస్థితికి, నాయకుల పోరుకు కారణమవుతోంది. అధికారంలో ఉన్నప్పుడు ఎవరి మాటా వినని చంద్రబాబు మాట.. ఇప్పుడెవరూ వినే పరిస్థితిలో లేనట్టుంది. నన్నెవరూ అడగలేరు.. అనే ధోరణిలో ఉన్న కేశినేని నానికి చంద్రబాబు కూడా సర్ది చెప్పలేని పరిస్థితి. ఎన్నికల్లో నట్లు, బోల్టులతో సహా ఊడిపోయిన తెలుగుదేశం సైకిల్ కు టైర్లలో గాలైనా నింపిన వ్యక్తి కేశినేని నాని. ఎమ్మెల్సీ అయిన వ్యక్తి బుద్దా వెంకన్న పార్టీ వాణి బలంగా వినిపించగలరు. టీడీపీకి ఉన్న అద్భుతమైన స్పోక్స్ పర్సన్. వీరిలో ప్రస్తుతం తానున్న పరిస్థితుల్లో బుద్దా వెంకన్నకు మాత్రమే సర్ది చెప్పే పరిస్థితి చంద్రబాబుది. కోర్టులు, ఎన్నికల కమీషన్లతో వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లినా ప్రజల్లో వైసీపీ సత్తా చాటుకోవడం చంద్రబాబుకు పెద్ద షాక్. పంచాయతీ ఎన్నికలు, విజయవాడ పంచయితీని రెండూ చంద్రబాబే చూడాలంటే కాని పని. పోనీ.. రెండింటిలో ఏదొకటి లోకేశ్ తోసహా పార్టీలో మరొకరికి అప్పజెప్పినా ఉపయోగం లేదు. అసలే పెనం మీద కూర్చున్నట్టున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు.. పార్టీలోని అంతర్గత కలహాలతో పొయ్యిలో పడినట్టు అవుతోంది!