Chandrababu: చంద్రబాబు Chandrababu ఏపీలో మున్సిపల్ ఎన్నికల హోరు నడుస్తోంది. పంచాయతీ ఎన్నికల్లోనే నువ్వా-నేనా అని తలపడ్డ వైసీపీ, టీడీపీలు మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీగా పోరాడుతున్నాయి. అయితే.. ఈ రెండు పార్టీల్లో టీడీపీకి ఇంటి పోరు ఎక్కువైంది. ముఖ్యంగా.. ఉమ్మడి ఏపీలోనూ.. ప్రస్తుతం కూడా ఏపీ రాజకీయాల్ని శాసించే విజయవాడలో టీడీపీ నేతల మధ్య పోరు సమసినట్టే సమసిపోతోంది.. మళ్లీ తారాజువ్వలా ఉవ్వెత్తున లేస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఈరోజు విజయవాడలో పర్యటనకు, ఎన్నికల ప్రచారానికి వచ్చారు. ఇప్పటివరకూ పార్టీ నేతల్లో జరుగుతున్న గొడవలపై ఆయన నర్మగర్భమైన వ్యాఖ్యలు చేశారు.
‘మా పార్టీ నేతల్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువైంది.. త్వరలోనే నియంత్రిస్తా.. చూస్తూ కూర్చోను’ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పర్యటన రూట్ మ్యాప్ ను మార్చారంటూ బొండా ఉమ, బుద్దా వెంకన్న, నాగుల్ మీరా ఫైర్ అయ్యారు. నాకు చంద్రబాబు రూట్ మ్యాప్ తో పని లేదని కేశినేని నాని అంటున్నారు. విజయవాడ వరకూ నేనే హైకమాండ్ అని కూడా అన్నారు. చంద్రబాబును ఏమైనా అంటే చూస్తూ ఊరుకోను అంటున్నారు బుద్దా వెంకన్న. చంద్రబాబు కోరితే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని నాని అంటుంటే.. వచ్చే ఎన్నికల్లో నేనే ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేస్తా అని వెంకన్న అంటున్నారు. ఇలా మొత్తంగా టీడీపీ పరువును బజారుకు ఈడ్చేశారు.
ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే.. మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యాక పార్టీ వ్యవహారాల్ని చక్కదిద్దుతారని తెలుస్తోంది. చంద్రబాబుకు విజయవాడ తలనొప్పి కంటే రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఉనికిని చాటుకోవడం.. ఇతర మున్సిపాలిటీల్లో టీడీపీ విజయం కోసం ప్రచారం ముఖ్యమనే భావనకు వచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతానికి పార్టీ ఆదేశాలను పాటించేలా చేసి ఆ తర్వాత నేతలు అందరినీ పిలిచి సమస్య పరిష్కరిస్తారని తెలుస్తోంది. అయితే.. అసలే రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి బాగోలేని సమయంలో పార్టీ విజయవాడ నేతల తీరు సహజంగానే చంద్రబాబుకు ఆగ్రహం తెప్పించాయని తెలుస్తోంది.