టీడీపీ అధినేత చంద్రబాబుకు కోపం వచ్చింది. రాజధాని వికేంద్రీకరణపై ఎలా పోరాటం చేయాలా ఆలోచిస్తున్న చంద్రబాబు ఒ నిర్ణయానికి వచ్చారు. దాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వానికి 48 గంటల గడువు ఇచ్చారు. ఈ రోజు అమరావతిలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. రాజధాని అమరావతి సమస్య ఏ ఒక్కరిదో కాదని అయిదు కోట్ల మంది ప్రజల సమస్య అని అన్నారు.
వైసీపీ నేతలు ఎన్నికల ముందు రాజధాని మార్చబోమని చెప్పి ప్రజలను వంచించారని విమర్శించారు. అసెంబ్లీని రద్దు చేసి ప్రజా తీర్పునకు సిద్ధం కావాలని సీఎం వైఎస్ జగన్ కు సవాల్ విసిరారు చంద్రబాబు.
పోరాటంపై సర్వత్రా ఉత్కంఠ..!
మూడు రాజధానుల విషయంలో తెలుగుదేశం పార్టీ మాట నెగ్గకపోవడం, అమరావతిని రాజధానిగా కొనసాగించకపోవడంపై తెలుగుదేశం పార్టీ ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏ విధంగా పోరాటం చేస్తారు? రాజీనామాలు చేస్తారా? దీక్షలు చేస్తారా? ధర్నాలు చేస్తారా? ఆందోళనలు చేస్తారా? అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
తెలుగుదేశం పార్టీ కూడా ఈ విషయమై అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యేలతో, పార్టీ సీనియర్ నాయకులతోనూ మంతనాలు జరిపి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం అమలు చేయడానికి ప్రభుత్వానికి 48 గంటలు గడువు ఇచ్చారు. ఈ 48 గంటల్లో ప్రభుత్వం స్పందించకపోతే చంద్రబాబు.. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి, నిరాహారదీక్షలు చేయిస్తారని సమాచారం.
ఈ 48 గంటల్లో జిల్లాల వారీగా ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని కూడా తెలుగుదేశం పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా రాజధాని విషయంలో తెలుగుదేశం పార్టీకి గట్టి పోరాటానికే సిద్ధం అవుతోంది. ఒ వైపు కరోనా, మరో వైపు లాక్ డౌన్, ప్రాణభయం ఇవన్నీ వెంటాడుతున్నప్పటికీ తమ ముద్ర పోతుందన్న ఆందోళనతో తెలుగుదేశం పార్టీ మాత్రం పోరాటం వీడే ప్రసక్తే లేదు అన్నట్టు రకరకాల ఆలోచనలు చేస్తోంది.