అమరావతి, జనవరి 23: అగ్రకులాల్లో కాపులు సగంపైగా ఉన్నారు, వారికి ఈబిసి రిజర్వేషన్లలో ఐదు శాతం ఇస్తే తప్పేంటని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. బుధవారం ఆయన పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ బాధ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కాపుల రిజర్వేషన్లను బిజెపి, వైసిపి నేతలు వక్రీకరిస్తూ, కులాల్లో చిచ్చుపెట్టాలని చూస్తున్నారు, వారి కుట్రలను తిప్పికొట్టాలని చంద్రబాబు సూచించారు.
అగ్రకులాల్లో కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలు అధికం శాతం ఉన్నారని చంద్రబాబు పేర్కొన్నారు. వీరికి ఈబిసి పది శాతం రిజర్వేషన్లలో 5శాతం ఇచ్చామని చంద్రబాబు అన్నారు. కాపుల రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి ఢిల్లీకి పంపాం. దానిపై ఏనాడైనా బిజిపి, వైసిపి నేతలు మాట్లాడారా? అని చంద్రబాబు ప్రశ్నించారు.
ఢిల్లీకి వెళ్లి కాపుల రిజర్వేషన్లపై అడగలేని అసమర్థులు, కాపులకు మేలు చేసిన టిడిపిని నిందిస్తున్నారని చంద్రబాబు అన్నారు. 35ఏళ్లుగా పార్టీ జండా భుజాన మోస్తున్నారు, వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. వారికి ఐదు శాతం రిజర్వేషన్లు ఇస్తే బిజెపి, వైసిపిలకు ఉన్న అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు.
దేశంలో అవినీతిని 85శాతం నియంత్రించామని మోదీ అనడం హాస్యాస్పదంగా ఉందని చంద్రబాబు అన్నారు.
దావోస్లో రఘురామ్ రాజన్ వ్యాఖ్యలు మోదీ పాలన డొల్లతనాన్ని బయటపెట్టాయని పేర్కొన్నారు.
కోల్కతా ర్యాలీ ప్రకంపనల నుండి బిజెపి తేరుకోలేదని, అమిత్షా, మోదీ వ్యాఖ్యల్లో అదే కనిపిస్తుందనీ ఆయన అన్నారు.
నేడు ఈవిఎంలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది, ఈవిఎంలపై చర్చను పక్కదారి పట్టించాలని బిజెపి చూస్తోందని చంద్రబాబు విమర్శించారు. మళ్లీ బ్యాలెట్ పేపరు కావాలనేది అందరి డిమాండ్ అని చంద్రబాబు అన్నారు.
వివి ప్యాట్ రశీదులన్నా వంద శాతం నియోజకవర్గాల్లో అమలు అయ్యేలా చూస్తే ప్రజల్లో ఉన్న అపనమ్మకం పోతుందని చంద్రబాబు అన్నారు.
దావోస్లో లోకేశ్ బృందం సత్ఫలితాలు సాధిస్తోందని, ఎపిలో పెట్టుబడులకు అనేక కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని చంద్రబాబు చెప్పారు. డెలాయిట్, విప్రో, ఎజైల్ గవర్నెన్స్, స్విస్రే సంస్థలు ముందుకు వచ్చాయని చంద్రబాబు తెలిపారు.