Chandrababu : కుప్పం అంటే టీడీపీ.. టీడీపీ అంటే చంద్రబాబు.. చంద్రబాబు అంటే కుప్పం..! 1989 నుండి చంద్రబాబు వరుసగా అక్కడి నుండి గెలుస్తూనే వస్తున్నారు. కానీ ఇప్పుడు లెక్కలు మారుతున్నాయి. కుప్పం నియోజకవర్గాన్ని ఇక చంద్రబాబు కోల్పోనున్నారా..!? కుప్పంలో ఏం జరుగుతుంది..? ఏం జరగబోతుంది..!? పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కారణాలు ఏమిటి..? ఇక జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలు ఎలా రాబోతున్నాయి..!? అసలు కుప్పం నియోజకవర్గంలో టీడీపీ కోల్పోవడానికి.. వైసీపీ వెలగడానికి కారణాలు ఏమిటి..!? కీలక విశ్లేషణని “న్యూస్ ఆర్బిట్” రెండు భాగాల్లో ప్రత్యేకంగా అందిస్తుంది..!!
Chandrababu : పంచాయతీల్లో వైసీపీ గెలుపు వెనుక..!?
కుప్పం నియోజకవర్గంలో మొత్తం 89 పంచాయతీలు ఉన్నాయి. నిన్న ఎన్నికలు జరిగాయి. వీటిలో 74 స్థానాల్లో వైసీపీ మద్దతుదారులు గెలిచారు. 14 స్థానాల్లో టీడీపీ మద్దతు దారులు గెలిచారు. మరో ఒక్క స్థానంలో కాంగ్రెస్ మద్దతు దారుడు గెలిచారు. మొత్తం పోలైన ఓట్లలో వైసీపీ మద్దతుదారులకు 65 శాతం వచ్చాయి. టీడీపీ మద్దతు దారులకు 28 శాతం వచ్చాయి. 7 శాతం మాత్రం ఇతరులకు వచ్చాయి. అంటే… ఇక్కడ వైసీపీ హవా పెరిగినట్టే..! 2013 పంచాయతీ ఎన్నికల్లో 81 పంచాయతీలు టీడీపీ మద్దతు దారులు గెలుచుకున్నారు. కాంగ్రెస్ హవా/ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హవా ఉన్న 2006 లో కూడా 59 పంచాయతీలు టీడీపీ మద్దతు దారులు గెలుచుకున్నారు. కానీ 2021 లో ఫలితం మారిపోయింది. చంద్రబాబు గూడు కూలిపోతుంది. దీని వెనుక వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పకడ్బందీ వ్యూహం, గట్టి ప్రణాళిక ఉన్నాయి. చివరి వారంలో సంప్రదింపులు జరిపి.. చివరి రెండు రోజుల్లో కొనుగోళ్లు జరిపి.. ఓటింగ్ రోజున టీడీపీకి ఊహించని దెబ్బ పడేలా చేయడంలో పెద్దిరెడ్డి వ్యూహాత్మక విజయం సాధించారు.
టీడీపీలో డమ్మీ నాయకులేనా..!?
టీడీపీకి కుప్పం కంచుకోట. చంద్రబాబుకి ఓటమి లేని రాజకీయాన్ని కుప్పం అందిస్తుంది. కానీ ఇప్పుడే ఎందుకు ఇలా జరిగింది..? అంటే చంద్రబాబు స్వీయ తప్పిదాలే. కుప్పంలో కొందరు డమ్మీ నాయకులను చంద్రబాబు తన అనుచరులుగా పెట్టుకున్నారు. వారి ద్వారా తన ప్రాబల్యం నడిచేలా చేసుకున్నారు. ఇప్పుడు వారిలో చాలా మంది వైసీపీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా దగ్గరయ్యారు. పెద్దిరెడ్డి పక్కా స్కెచ్ తో గెలుపు సాధించారు.
* ముప్ఫయ్ ఏళ్లుగా చంద్రబాబు పీఏగా ఉన్న మనోహర్ కూడా వైసిపిలో చేరలేదు కానీ.. వారికి పరోక్ష మద్దతు ప్రకటించేశారు. మరో కీలక అంశం ఏమిటంటే..? ఈ మనోహర్ .. కుప్పం మున్సిపాలిటీ వైసీపీ ఇంచార్జి కలిపి బిజినెస్ భాగస్వాములు..!
* కుప్పం నియోజకవర్గంలోని మండల స్థాయిలో చంద్రబాబు బంటులుగా.., టీడీపీకి కీలకంగా ఉన్న తొమ్మిది మంది నాయకులకు వైసిపిలో చేర్చుకున్నారు. నియోజకవర్గ స్థాయిలో కీలకమైన టీడీపీ నేత సుధీర్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. ఇక ఎన్నికల సమయంలో..
* ముందుగా అధికార పార్టీ లెక్కల ప్రకారం టీడీపీకి 55 పంచాయతీలు.., వైసీపీకి 34 పంచాయతీలు వస్తాయి అనుకున్నారు. సో… వైసీపీ కీలక స్ట్రాటజీ మొదలు పెట్టింది. మంత్రి పెద్దిరెడ్డి టీమ్ రంగంలోకి దిగింది. టీడీపీలో ఎక్కడెక్కడ..? ఏ పంచాయతీల్లో బలం ఉందొ.. ఏ నాయకులు బలంగా ఉన్నారో..? గుర్తించి వారిని సైలెంట్ చేసారు. అడిగిన కోరిక తీర్చారు. కొందరు పోటీ దారులను సైలెంట్ చేశారు. కొన్ని గ్రామాల్లో భారీగానే ఖర్చు చేశారు. మొత్తానికి ఒక కమర్షియల్, ఫక్తు చంద్రబాబు తరహా డబ్బు రాజకీయాన్ని కుప్పంలో చేశారు.
* చంద్రబాబు నిర్మించుకున్న డమ్మీ రాజకీయ సామ్రాజ్యాన్ని కొంత కూల్చేశారు. చంద్రబాబుకి అక్కడ నమ్మిన బంటులు ఎవరూ లేరు. అంతా కమర్షియల్ అని ఒక్క ఎన్నికతో పెద్దిరెడ్డి తేల్చేశారు. ఇక్కడితో సినిమా అయిపోలేదు.
* కుప్పం మున్సిపాలిటీకి ఎన్నికలు జరగనున్నాయి. దీన్ని కూడా చేజిక్కించుకునే పనిలో వైసిపి ఉంది. పెద్ద కష్టం కాదు కూడా. ఇప్పటికే చైర్మన్ అభ్యర్థిగా సుధీర్ రెడ్డి టీడీపీ నుండే వచ్చారు. ఆయన టీడీపీలో బలాలు, బలహీనతలు తెలుసు. కుప్పంలో 18 వార్డుల్లో ఇప్పటికే గ్రౌండ్ లెవల్ పాలిటిక్స్ మొదలు పెట్టేసారు. కుప్పం పట్టణంలో చంద్రబాబుకి, టీడీపీకి వీర విధేయులుగా ఉన్నవారిని గుర్తించి సైలెంట్ చేసే పనిలో ఉన్నారు. లోతుగా రాజకీయ స్ట్రాటజీ చేస్తున్నారు. కుప్పం మున్సిపాలిటీ కొట్టి.. వచ్చే ఎన్నికల నాటికి కుప్పంలో చంద్రబాబుని ఓడించాలి అనే పెద్దిరెడ్డి వ్యూహానికి కొంత పునాదులు నిర్మించనున్నారు.
Part 2 – జగన్ పగా..!? పెద్దిరెడ్డి ప్రతీకారమా..!? కుప్పంలో వైసీపీ స్కెచ్ – “న్యూస్ ఆర్బిట్” ప్రత్యేకం..!! (Click Here)
(కుప్పంలో చంద్రబాబు ఎలా గెలుస్తున్నారు..? అక్కడ ఓటర్ల లెక్క ఏమిటి..? ఇప్పుడు పెద్దిరెడ్డి ఎటువంటి స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. పెద్దిరెడ్డికి చంద్రబాబుకి వ్యక్తిగతంగా గొడవ పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది..? ఈ మొత్తం విశ్లేషణని వచ్చే కథనంలో చెప్పుకుందాం)