అమరావతి, ఫిబ్రవరి 1: విభజన హామీలను విస్మరించిన కేంద్ర ప్రభుత్వంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఎప్పుడూ లేని విధంగా ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహంతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం గురించి బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చెప్పిన మాటలు చంద్రబాబుకు ఆగ్రహాన్ని తెప్పించాయి.
బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ, కేంద్రం రాష్ట్రానికి ఏమీ అన్యాయం చేయలేదని, వేల కోట్ల రూపాయలు విడుదల చేసిందని అన్నారు. అయినా భారతీయ జనతా పార్టీపై బురదచల్లారనీ అన్నారు. బ్లాక్ డే అని చెప్పి సీఎంతో సహా అధికార పార్టీ ఎమ్మెల్యేలు నల్లడ్రస్సులను ధరించి అసెంబ్లీకి రావడం మంచి పద్ధతి కాదని అన్నారు. కేంద్రం ఏదో తీరని అన్యాయం చేసిందని అభాండాలు వేయడం దారుణమని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి బిజెపి కట్టుబడి ఉంది. చట్టంలో లేనటువంటివి ఎన్సిఆర్టి, ఫ్యాషన్ టెక్నాలజీ తదితర సంస్థలను కూడా కేంద్రం ఇచ్చిందని విష్ణుకుమార్ రాజు అంటుండగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్క సారిగా లేచి సిగ్గులేకుండా మట్లాడుతున్నారు అంటూ విరుచుకుపడ్డారు.
ఈ సంస్థలు ఎవరి కోసం ఇస్తారు, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలకు ఏం ఇచ్చారు. మనకు ఏం ఇచ్చారు అని ప్రశ్నించారు. ఏం తమాషాలు ఆడుతున్నారు, ఏమనుకుంటున్నారు. ప్రజా ప్రతినిధిగా ఉండానికి మీకు అర్హత లేదు, మీరు ఊడిగం చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దశలో ‘అడిగే వారు లేరనుకుంటున్నారు, మమ్మల్ని ఏం చేస్తారు?, జైలులో పెడతారా? కొత్త రాష్ట్రం ఏర్పడితే సహకరించాల్సింది పోయి సిగ్గు విడిచి మాట్లాడుతున్నారు. బిజిపి నేతలను తిరగనివ్వరు జాగ్రత్త’ అంటూ మండిపడ్డారు. వినేవాళ్లు ఉంటే చెవులో పూలు పెడతారు, యు ఆర్ అన్ఫిట్ ఫర్ ఎమ్మెల్యే అంటూ చంద్రబాబు ఊగిపోయారు. చంద్రబాబు ఆవేశపూరిత ప్రసంగంతో విష్ణుకుమార్ రాజు సభ నుండి వెళ్లిపోయారు.