Chandrababu Naidu: టీడీపీ అంటే ప్రస్తుతం రాష్ట్రంలో సీనియారిటీ ఉన్నా పార్టీ. దాని కంటే దశాబ్దాలకు పైబడిన సీనియారిటీ ఉన్న చరిత్ర కాంగ్రెస్ కి ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఆ పార్టీకి ఐసీయూలోకి వెళ్ళిపోయింది. అంచేత ప్రస్తుతం కాస్త ప్రజాబలం ఉన్న సీనియరిటీ రాజకీయ పార్టీ అంటే తెలుగుదేశమే వస్తుంది.. అంతటి సీనియారిటీ పార్టీలో సీనియర్ నాయకులకు కొదవేం లేదు.. కానీ పార్టీకి ప్లస్ గా మారాల్సిన ఆ సీనియర్లు, పార్టీకి భారమైతే ఆ శిరోభారం మామూలుగా ఉండదు.. ప్రస్తుతం పార్టీ అధినేత చంద్రబాబు అదే దశలో ఉన్నారు. టికెట్ ఇస్తే గెలవరు.. ఇవ్వకపోతే ఊరుకోరు.. కుటుంబ సభ్యులకు ఇచ్చినా గెలిపించలేరు.. పైగా బ్లాక్ మెయిళ్లు చేస్తారు.., పక్కనున్న నియోజకవర్గాల్లో వేలు పెట్టి కెలికేస్తారు..! ఇదీ పార్టీలో దాదాపు పది మంది పరిస్థితి అలాగే ఉంది..!
Chandrababu Naidu: జగన్ దెబ్బను తట్టుకోవాలంటే..!?
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో టీడీపీలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పని చేసిన చాలా మంది సైలెంట్ అయిపోయారు. కేసులు ఎదుర్కొన్నారు. ఆర్ధిక మూలాలపై దెబ్బలు కొట్టుకున్నారు. కొంత మంది భరించలేక సైలెంట్ అయిపోయారు. కొంత మంది వేరే పార్టీలకు వెళ్లిపోయారు. కొంత మంది ఇన్ యాక్టివ్ అయిపోయారు. కొంత మంది అధికార పార్టీలో జాయిన్ అయిపోగా కొంత మంది కోవర్టులుగా ఉన్నారు. వారిలో ఎమ్మెల్యేలో, నియోజకవర్గ ఇన్ చార్జిలో అయితే ఫరవాలేదు. కొంత మంది మంత్రులుగా చేసిన వారు ఆ విధంగా తయారు కావడంతో ఆ నియోజకవర్గాల్లో పార్టీ తీవ్రంగా నష్టపోతోంది. ఇది టీడీపీకి పెద్ద సమస్యగా మారింది. కొంత మంది మాజీ మంత్రుల వల్ల వారి సొంత నియోజకవర్గాల్లో పార్టీ బలపడటం లేదు. వాళ్ల వల్ల ఆ జిల్లాలో గ్రూపుల వల్ల కూడా నష్టం జరుగుతోంది..!
ఉదాహరణలు కోకొల్లలు.. కానీ.. వీరు ముఖ్యులు..!
* యనమల రామకృష్ణుడు. ఆయన ఆరు సార్లు వరుసగా తుని నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగారు. మంచి సబ్జెక్ట్ ఉన్న నేతగా పేరు ఉంది. స్పీకర్ గా, మంత్రిగా పని చేశారు. 1995 ఆగష్టు సంక్షోభంలో ఎన్టీఆర్ ని దించేసి, చంద్రబాబుని సీఎం చేయడంలో స్పీకర్ పొజిషన్ లో ఈయన కీలక పాత్ర పోషించారు.. దాదాపు పార్టీలో నెంబర్ 2 పొజిషన్ లో ఉన్నారు. ఆయన సొంత నియోజకవర్గం తునిలో వరుసగా మూడు సార్లు టీడీపీ ఓడిపోయింది. ఆయన తమ్ముడే పోటీ చేసి ఓడిపోయారు. ఆ నియోజకవర్గంలో వేరే వాళ్లకు టికెట్ ఇవ్వనివ్వడం లేదు. వాళ్ల కుటుంబం నుండి టికెట్ ఇస్తే గెలవడం లేదు. అంతే కాకుండా ఆయన సామాజికవర్గం బలంగా ఉన్న ఇతర నియోజకవర్గాల్లో కూడా వేలు పెట్టి డిస్ట్రబ్ చేస్తున్నారని అంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సిటీతో పాటు పలు నియోజకవర్గాల్లో కొంత డిస్ట్రబెన్స్ జరుగుతోంది. టీడీపీకి ఇది ఒక సమస్యగా ఉంది. ఈ జిల్లాలో యనమల రామకృష్ణుడు పరిస్థితి ఉండగా..!
* నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీరు కూడా అలానే ఉంది. ఆయన సొంత నియోజకవర్గం సర్వేపల్లిలో వరుసగా అయిదు ఎన్నికల నుండి ఓడిపోతున్నారు. ఆయన సొంత నియోజకవర్గంలో పార్టీ బలోపేతం అవ్వడం లేదు కదా, నెల్లూరు సిటీ, జిల్లాలోని ఆత్మకూరు, కావలి వంటి నియోజకవర్గాల్లో కూడా పార్టీ క్షేత్ర స్థాయిలో బలపడటం లేదు. సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి సీనియర్ నాయకుడు, ఆ జిల్లాలో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలి, కానీ అలా జరగడం లేదు. పార్టీలో కొందరి సీనియర్ల మనస్థత్వం ఎలా ఉంది అంటే..? ఒక అహంభావం, పార్టీలో దశాబ్దాల తరబడి ఉన్నాం, మేము సీనియర్ నాయకులం, కొత్తగా వచ్చిన నాయకులు మాకు సలహాలు ఇచ్చేది ఏమిటి, మేము చెప్పినట్లే అందరూ వినాలి. పార్టీ అంటే మాది అన్నట్లుగా ఫీల్ అవుతున్నారు. పార్టీలో వారు సీనియర్ లు కావచ్చు. కానీ కొత్త కొత్త ఐడియాలజీలు వస్తున్నాయి, కొత్త కొత్తగా రాజకీయం చేయాల్సిన అవసరం ఏర్పడింది. అయినా సరే మూస ధోరణిలో రాజకీయం చేస్తామంటే నడవదు.
* వీళ్ల ఇద్దరితో పాటు తెనాలిలో ఆలపాటి రాజా, కొవ్వూరులో కొత్తపల్లి శ్యామ్యూల్ జవహార్ లాంటి వాళ్లు ఉన్నారు. జవహార్ మంత్రిగా ఉన్నప్పుడే ఆయన సొంత నియోజకవర్గం కొవ్వూరులో అనేకపొరపచ్చాలు వచ్చాయి. అందుకే ఆయనకు కొవ్వురు టికెట్ ఇవ్వకుండా కృష్ణాజిల్లా తిరువూరు టికెట్ ఇచ్చారు. అక్కడ కూడా ఆయన గెలవలేదు. ఆయనకు కొవ్వూరు పోయింది. ఇటు తిరువూరులోనూ ఓడిపోయారు. ఆయన తరువాత ఎక్కడ నుండి పోటీ చేస్తారో తెలియదు. ఆయనకు టికెట్ ఇవ్వడానికి వీలులేదంటూ కొవ్వూరులో క్యాడర్ ఇప్పటికీ పట్టుబడుతోంది. ఆయనతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మాజీ ఎమ్మెల్యే పీతల సుజాత ఉన్నారు. మంత్రిగా కూడా పని చేశారు. ఆమెను వడ్రానం మంత్రి అని అంటుంటారు. ఆమె కూడా చింతలపూడిలో ఉన్నంత కాలం చాలా గ్రూపులు ఉండేవి. ఆమె వ్యవహారాల శైలి వల్ల టీడీపీ కొన్ని గ్రూపులుగా విడిపోయింది. అందుకే 2019లో ఆమెకు టికెట్ ఇవ్వలేదు. అక్కడ కర్రి రాజారావుకు టీడీపీ టికెట్ ఇస్తే ఆయన ఓడిపోయారు. ఆ తరువాత ఆయన దివంగతులు అయ్యారు. ప్రస్తుతం చింతలపూడి సీటు ఖాలీగా ఉండటంతో తనకు ఇవ్వాలని పీతల సుజాత పట్టుబడుతున్నారు. కానీ అక్కడ వేరేవేరే కొత్త కొత్త పేర్లు తెరమీదకు వస్తున్నాయి. వీళ్లతో పాటు మరి కొందరు ఉన్నారు.
* మరో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఉన్నారు. పార్టీ అధికారంలో ఉంటే ఆయన మంత్రిగా మంచి దర్పం చెలాయిస్తారు. పార్టీ ఓడిపోయిన తరువాత ఆయన సీనియారిటీకి పార్టీకి అసెట్ గా మారాల్సింది పోయి పార్టీకి భారంగా మారుతున్నారు. తనతో పాటూ.. మరో మూడు, నాలుగు సీట్లకు బేరం నడుపుతున్నారు. అదే విధంగా ఎడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కళా వెంకట్రావు ఉన్నారు. ఆయన వల్ల ఎడ్చర్లతో పాటు పాతపట్నం, రాజాం మూడు నియోజకవర్గాల్లో డిస్ట్రబెన్సెస్ వస్తున్నాయి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీలో పది మంది మాజీ మంత్రుల తీరుతో వారి సొంత నియోజకవర్గాలతో పాటు పక్క నియోజకవర్గాల్లోనూ టీడీపీ నష్టపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని అంటున్నారు. వీరంతా సీనియర్ నాయకులు అయినప్పటికీ పాత తరహా రాజకీయాలే చేస్తున్నారు తప్ప క్షేత్ర స్థాయి పరిస్థితులను తెలుసుకుని రాజకీయం చేయడం లేదు. ఆ నియోజకవర్గాల్లో అధికార పార్టీ చేస్తున్న తప్పులు ఏమిటి.. వాటిని ప్రజల్లోకి తీసుకుపోవడం ఎలా.. ఆ జిల్లాలో పార్టీ బలోపేతానికి ఏయే నియోజకవర్గాల్లో ఎవరిని పెడితే బాగుంటుంది.. మా వాళ్లనే పెట్టాలి.. మా వాళ్లనే పెట్టాలి అన్నట్లు కాకుండా ఎవరిని పెడితే బాగుంటుంది అని కొత్త తరహా ఆలోచనలు చేయాల్సి ఉండగా వీళ్లు ఆ విధానాలకు అలవాటు పడటం లేదు. ఇదే చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారింది. కొందరు సీనియర్ నేతలే టీడీపీకి పెద్ద మైనస్ అని ఆ పార్టీ శ్రేణులే అంటున్నారు..!