టీడీపీకి, చంద్రబాబుకి కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. కరోనా కష్ట కాలం కారణంగానో, కాలం కలిసి రాకనో వారికి ఊహించని కష్టం వచ్చింది. దీనికి పరిష్కారం కూడా దొరక్క ఆయనతోపాటు పార్టీ నేతలు కూడా తలలు పట్టుకుంటున్నారు. దేశంలో ప్రచారం, మీడియా యావ ఎక్కువగా ఉన్న నాయకుల్లో చంద్రబాబు ఒకరు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ మీడియా ప్రచారం లేకపోవడమే బాబుకు వచ్చిన కష్టం.
ప్రెస్ మీట్లు, మీడియాలో హడావిడి ఏది..
కరోనా మొదలైనప్పటి నుంచే బాబుకు కష్టాలు వచ్చాయి. స్వతహాగా టీడీపీకి, చంద్రబాబుకి మీడియా అటెన్షన్ కావాలి. అనుకూల మీడియాలో బాకా ఊదుతుంటే సంబరపడిపోవడం వారికి అలవాటు. అటువంటిది కరోనా వచ్చి మీడియా లైవ్ సమావేశాలకు చంద్రబాబును దూరం చేసింది. కేవలం జూమ్ సమావేశాలకే పరిమితం కావడం వారిని మానసికంగా బాధ పెట్టే అంశమే. ఎందుకంటే అనుకూల మీడియాలో బాబు ప్రెస్ మీట్లకు ఇంపార్టెన్స్ ఇచ్చి కొత్త చర్చలకు అవకాశం ఇచ్చేవి. ఇవి కూడా వారికి అనుకూలంగా ఉంటాయి తప్ప ప్రజా హితం కోరి కాదు. వీరికొచ్చిన మీడియా కష్టాలను అధిగమించేందుకు కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు.
సొంతంగా ఛానెల్, పత్రిక..
సోషల్ మీడియాలో చినబాబు లోకేశ్ యాక్టివ్ గా ఉంటున్నాడు. ఈ వింగ్ కు ప్రత్యేకంగా కార్యకర్తలు కూడా ఉన్నారు. ఏడాది లోపు వీరి సంఖ్య పెంచి, ట్యాబ్, స్మార్ట్ ఫోన్లు ఇచ్చి నెల వేతనం ఇచ్చి ఈ వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రణాళికలు వేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలవారీగా పది మంది కార్యకర్తల ఎంపిక జరుగుతోంది. వీరిలో ఒకరిని జిల్లా కన్వీనర్ గా ఎంపిక చేసి వారి ద్వారా టీడీపీ సొంత యూట్యూబ్ ఛానెల్, ఈ-పేపర్ కు వార్తలు, పార్టీ సమాచారం చేరవేయనున్నారు. ఇదంతా జిల్లాల వరకూ వర్కౌట్ అవుతుంది. కానీ.. చంద్రబాబు రేంజ్ కి ఇంకా పెద్దస్థాయి ఉండాలి. ఇందుకే టీడీపీ తలలు పట్టకుని ఏం చేయాలా అని ఆలోచిస్తోందని సమచారం.