‘ఓటుకు నోటు’.. దేశంలోనే సంచలనం రేపిన కేసు అది. ‘అత్యంత సీనియారిటీ ఉన్న నాయకుడిని.. 40 ఏళ్ల రాజకీయ అనుభవం.. ముఖ్యమంత్రిగా 14 ఏళ్ల ప్రస్థానం నాది’ అని చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 2015లో ఓ కేసులో ఇరుక్కున్నారు. నిజానిజాలేంటో తెలీకపోయినా ఆ కేసులో చంద్రబాబుదే కీలక పాత్ర అని ఆ సంఘటన చూసిన, మాటలు విన్న వారు చెప్పే మాట. దీనిని ఆధారంగా చేసుకునే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో చంద్రబాబుపై 2017లో కేసు వేశారు. అధికారంలో ఉండబట్టి చంద్రబాబు ఆ కేసును పెద్దగా పట్టించుకోలేదు కానీ.. ఇప్పుడు మాత్రం ఆయన్ను వణికిస్తోంది.. ‘ఓటుకు నోటు’.
చంద్రబాబు ‘స్టే’లకు కాలం చెల్లినట్టేనా..!
చంద్రబాబుకు రాజకీయ వర్గాల్లో, సొంత పార్టీ నేతల్లో కూడా ఉన్న పేరు.. వ్యవస్థలను మేనేజ్ చేస్తారనే. అయితే.. ఇన్నాళ్లూ ఆ కేసులో ఏ1 నుంచి ఏ5 వరకే విచారణ జరుపుతున్నారనేది రామకృష్ణారెడ్డి వాదన. ఇప్పుడు ఈ కేసును మళ్లీ సుప్రీంకోర్టులో ఎర్లీ హియరింగ్ పిటిషన్ వేయగా ఈ కేసులో కదలిక వచ్చింది. 2021 జూలైలో కేసును విచారిస్తామని పేర్కొంది. దీంతో నాలుగేళ్ల తర్వాత ఈ కేసులో కదలిక వచ్చింది. ఇది చంద్రబాబుకు వణుకు తెప్పించే విషయమే. ఇన్నాళ్లూ కోర్టు కేసులపై సీఎం జగన్ ను మాత్రమే విమర్శించే చంద్రబాబుకు ఇది షాక్ ఇచ్చే వార్తే. ఎందుకంటే చంద్రబాబుపై లక్ష్మీపార్వతి వేసిన అక్రమాస్తుల కేసులో కూడా దాదాపు 20 స్టేలు తెచ్చుకున్నారనే అపవాదు కూడా ఉంది. ఇన్ని వెనుకున్నా చంద్రబాబు ఇతరుల కేసులపై చేసే వ్యాఖ్యలు మాత్రం విడ్డూరంగానే ఉంటాయి.
చంద్రబాబుకు వరుస షాకులు..
అయితే.. ఇటివల సీఎం జగన్ హైకోర్టు తీర్పులు ప్రభావితం అవుతున్నాయని ఏకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాయడం.. దానిని మీడియాకు వెల్లడించడం దేశంలోనే అతిపెద్ద సంచలనం. ఇందులో చంద్రబాబు పేరు కూడా పరోక్షంగా ఉంది. ఈ నేపథ్యంలో మొన్న మాజీ అడ్వొకేట్ జనరల్ విషయంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం తప్పుబట్టింది.. నిన్న ఉదయసింహ అరెస్టు జరిగింది.. ఈరోజు ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రపై అదే సుప్రీంకోర్టులో కదలిక వచ్చింది. ఈ గ్యాప్ లో సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి అమిత్ షాని కలవడం కేసులో కదలిక రావడం కీలక పరిణామంగా మారింది. జగన్ లేఖ రాయడం, సుప్రీం వ్యాఖ్యలు చేయడం చంద్రబాబుకు, ఆయన సామ్రాజ్యానికి ఈ చలికాలంలో కూడా చెమటలు పట్టించేవే. మరి.. చంద్రబాబు ఏమంటారో..!?