ఏపీకి చంద్రబాబు ఎందుకు రావడం లేదు..? ప్రతిపక్ష నేతగా… ముఖ్యమంత్రిగా… నాలుగు దశాబ్దాలు రాష్ట్రంలో పరిచితులు అయినా చంద్రబాబు హైదరాబాద్ కె పరిమితమయ్యారు ఎందుకు..? కరోనా కాలంలో, ప్రమాదాల సమయంలో… ఇటు రాలేక, అక్కడి నుండి రాజకీయం నడిపించలేక ముప్పుతిప్పలు పడుతున్నారు. బాబు రాజకీయ జీవితంలో ఇది కొత్త కాలంగా మారిపోయింది.
రావాలంటే ఏం చేయాలి…?
చంద్రబాబు నిజానికి ఏపీ రావాలంటే వచ్చేయొచ్చు. అనేక మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ నుండి రాష్ట్రానికి వస్తున్నారు, వెళ్తున్నారు. సో… బాబు కూడా రావచ్చు. కానీ అక్కడి డిజిపి అనుమతి తీసుకోవాలి. ఏపీలో డిజిపి అనుమతి తీసుకోవాలి. రెండు రాష్ట్రాల్లో అనుమతి తీసుకుని
రావాల్సి ఉంటుంది. కానీ ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడ ఉంటారు? అనేది చెప్పాల్సి ఉంటుంది. పాస్ తీసుకోవాలి. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన అమరావతిలో ఉండవచ్చు. కానీ బోర్డర్ లో పోలీసుల తనిఖీలు, ఇక్కడకు వచ్చిన తర్వాత బాడీ టెంపరేచర్, ఆరోగ్యం పరీక్షించి నివేదిక ఇస్తారు. ఒకవేళ తేడా కొడితే క్వరెంటైన్ తప్పనిసరి. ఇలా అనుమతులు తీసుకుని, పరీక్షలకు సహకరించి ఇక్కడకు వచ్చి ఉండవచ్చు. కానీ ఆయన ఒక చోట స్థిరంగా ఉంటూ రాజకీయం చేసే టైపు కాదు. వస్తే పర్యటనలు, మీటింగులు పెట్టుకోవాలి. అందుకే ఇవన్నీ ఎందుకు అని అక్కడే ఉండిపోయారు.
నాడు విశాఖ, నేడు ప్రకాశం…!
పాపం..! బాబు. నాడు విశాఖ వెళ్ళడానికి అనేక ప్రయత్నాలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలను కాదని కేంద్రానికి లేఖ రాశారు. ఏపీకి వెళ్లాలని ప్రత్యేక విమానానికి అనుమతులు ఇవ్వాల్సిందిగా ప్రధాని కార్యాలయం కార్యదర్శి మిశ్రాకు లేఖ రాశారు. ఆయన దాన్ని తిరస్కరించడంతో ఇక్కడకు రాలేకపోయారు. అందుకే విశాఖ వెళ్ళలేదు. పెద్ద ఘటనతో ప్రతిపక్ష నాయకుడు వెళ్ళలేదు అనే అపవాదు ఉండిపోయింది. తాజాగా మొన్న ప్రకాశం జిల్లాలో మరో ప్రమాదం జరిగింది. పది మంది మరణించారు. ఇక్కడకు నిజానికి బాబు వచ్చేవారే. కానీ ఆయన రాలేక పార్టీ బృందాన్ని పంపించారు. ఇలా రెండు కీలక, పెద్ద సంఘటనలకు ప్రతిపక్ష నాయకుడిగా బాబు వెళ్లలేకపోయారు. చంద్రబాబు రాజకీయ జీవితంలో ఒకే చోట స్థిరంగా ఇన్ని రోజులు ఉండడం ఇదే తొలిసారి.
లేఖలతో కాలక్షేపం…!
రాజకీయ నాయకులకు లేఖల రూపంలోనూ తమ వాయిస్ వినిపించడం కొత్త కాదు. ఇటీవల ఇవి ఎక్కువయ్యాయి. బహిరంగ లేఖల పేరిట ప్రధాని, సీఎం, ప్రజలు, ఇలా అనేక వర్గాలకు లేఖలు రాస్తుంటారు. చంద్రబాబు ఇప్పుడు ఇంట్లో ఖాళీగా ఉంటుండడంతో ఇవి ఎక్కువయ్యాయి. గడిచిన 40 రోజుల్లో ఆయన ఇటు ఏపీ సీఎం జగన్ కి, అటు కేంద్రానికి కలిపి 12 లేఖలు రాశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇదే బాటలో ఉన్నారు. బిజెపి కన్నా లక్ష్మీనారాయణ కూడా లేఖల బాట పట్టారు. ఇటీవల ఆయన ఏపీ సీఎం జగన్ కు ఎక్కువగా రాస్తున్నారు.