రాజకీయంగా మూడు దశాబ్దాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీకి క్షేత్ర స్థాయిలో బలమైన కార్యకర్తలు ఉన్నప్పటికీ నేడు ఆంద్రప్రదేశ్ లో ‘నేను ఉన్నాను’ అని చెప్పి భరోసా ఇచ్చే నాయకుడు లేకపోవడంతో క్యాడర్ నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతోందన్న మాటలు వినిపిస్తున్నాయి. పార్టీ ఆవిర్భావం నుండి అనేక అటు పోట్లు ఎదురైనప్పటికి బలమైన క్యాడర్ కారణంగా టీడీపీ సర్వైవ్ అవుతూ వచ్చిందని అయితే నేడు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న మెతక వైఖరి, ఆయన తనయుడు లోకేష్ కు నాయకత్వ పటిమ లేకపోవడం, నందమూరి ఫ్యామిలీకి పార్టీలో ప్రాధాన్యత లేకపోవడం తదితర కారణాల వల్ల క్యాడర్ అసహనంగా ఉందన్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల నుండి వినబడుతున్నది.
క్లోజ్ అవుతున్న సోషల్ మీడియా అకౌంట్ లు
గడచిన ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం నేపథ్యంలో నేతలు, కార్యకర్తలు వారి భవిష్యత్తు కోసం పక్క చూపులు చూసే పరిస్థితి ఏర్పడింది. వివిధ కారణాలతో పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న పలువురు కీలక నేతలు సైతం ఎన్నికల పూర్తి అయిన ఏడాదిలోపే అటు బీజేపీ, ఇటు వైఎస్ఆర్ సీపి కండువాలు కప్పుకున్నారు. పార్టీ నుండి బయటకు వెళ్లే నాయకులను నిలువరించడంలో చంద్రబాబు నాయుడు విఫలం అయ్యారని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిణామాల క్రమంలో నియోజక వర్గాల్లోని ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులకు పార్టీపై నమ్మకం సన్నగిల్లుతోందని అంటున్నారు. మరో పక్క కొందరు సోషల్ మీడియా కార్యకర్తలు సైతం కేసులకు భయపడి అకౌంట్ లను క్లోజ్ చేస్తున్నారన్న మాట కూడా వినిపిస్తోంది.
పార్టీ కీలక నేతల గుడ్ బై
పార్టీలోని ఇద్దరు, ముగ్గురు నేతలు అవినీతి, అక్రమాల కేసుల్లో ఇరుక్కోవడం, మరి కొందరిపైనా కేసులు నమోదు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్న వార్తలు షికారు చేస్తుండటం ఆ పార్టీ వర్గాలను ఆందోళనకు గురి చేస్తున్నాయని అంటున్నారు. ఏడాది కాలంలో నలుగురు రాజ్యసభ సభ్యులు, ముగ్గురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు, మరి కొందరు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు టీడీపీకి దూరం అయ్యారు. ఇంత జరుగుతున్నా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం ఇటువంటి అటు పోట్లు పార్టీకి కొత్త కాదని, పార్టీకి పూర్వ వైభవం వస్తుందని క్యాడర్ అధైర్య పడొద్దంటూ భరోసా ఇస్తున్నారు. చూద్దాం రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో!.