అమరావతి: సీఎం జగన్ తిక్క చేష్టలతో రాష్ట్రం పరువు పోతోందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మీడియాపై తప్పుడు కేసులు బనాయించడాన్ని ఆయన ఖండించారు. గత ఎనిమిది నెలలుగా ఏపీలో నిరంకుశ పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పాత్రికేయులకు రక్షణ లేకుండా పోతోందని, మీడియా స్వేచ్ఛను హరించే నియంతృత్వ వైఖరులను ఖండిస్తున్నామన్నారు. మందడంలోని పాఠశాలలో తరగతి గదులను పోలీసులు ఆక్రమించారని ఆరోపించారు.
విద్యార్ధులను బయటకు పంపడంపై మీడియాకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. విధి నిర్వహణలో భాగంగా విలేకరులు, ఫొటోగ్రాఫర్లు పాఠశాలకు వెళ్లారని తెలిపారు. తరగతి గదుల్లో ఆరేసిన పోలీసుల దుస్తులను ఫొటోలు తీశారు, ఛానళ్లలో ప్రసారం చేశారని చెప్పారు. దానిపై అక్కసుతోనే ముగ్గురు విలేకరులపై అక్రమ కేసులు పోలీసులు పెట్టారని ఆరోపించారు. తరగతి గదుల్లో పోలీసులు దుస్తులు ఆరేసిన ఘటనను ఫొటోలు తీసినందుకు విలేకరులపై కేసులు నమోదు చేయడాన్ని ఏమని భావించాలని ప్రశ్నించారు. మీడియాపై నిర్భయ కేసు పెట్టడం ప్రభుత్వ కక్ష సాధింపునకు పరాకాష్ట అని మండిపడ్డారు. తునిలో విలేకరి హత్య జరిగిందని, చీరాలలోనూ ఓ మీడియా ప్రతినిధిని చంపే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారం చేపట్టగానే ముగ్గురు మంత్రులు సమావేశం పెట్టి ఎంఎస్ వోలను బెదిరించారని ఆరోపించారు. రెండు ఛానళ్ల ప్రసారాలపై ఆంక్షలు పెట్టారని, అసెంబ్లీ ప్రసారాలు చేయకుండా మూడు ఛానళ్లపై నిషేధం విధించారన్నారు. జోవో 2430 తెచ్చి మీడియాపై ఉక్కుపాదం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాపై దౌర్జన్యాలు చేసిన వైసీపీ నేతలను ఏం చేశారని ప్రశ్నించారు. మీడియా గొంతు నులిమే నియంత పోకడలను ఖండిస్తున్నామని చెప్పారు. ఇలాంటి నియంతలంతా కాలగర్భంలో కలిసిపోయారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.