Vijayawada.. లో టీడీపీకి పట్టిన గుబులుతో చంద్రబాబుకి పగటి వేళే చుక్కలు కనిపిస్తున్నాయి. ఓవైపు ఏపీలో పంచాయతీ ఎన్నికల హీట్ రగులుతూనే ఉంది. పార్టీల గుర్తులపై జరిగే ఎన్నికలు కాకపోయినా పార్టీలు ప్రెస్టీజియస్ గా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. మాకు అంటే.. కాదు మాకే.. మాకు కూడా.. అనుకుంటూ వైసీపీ, టీడీపీ, జనసేన తమకు ఇన్ని పంచాయతీ స్థానాలు వచ్చాయని చెప్పుకుంటున్నాయి. మొత్తంగా చూస్తే ఈ మూడు పార్టీల్లో పరువు కోసం పోరాడుతోంది మాత్రం ఖచ్చితంగా టీడీపీనే. పార్టీని, ఎన్నికలను, సమన్వయం చేసుకుంటూ చంద్రబాబు ఒకింత పోరాడుతున్నారు. ఇంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్న చంద్రబాబుకు ఇప్పుడు పార్టీలోని అంతర్గత విబేధాలు మరింత తలనొప్పిని తెప్పిస్తున్నాయి. 2019 ఎన్నికల ఓటమినే ఇంకా జీర్ణించుకోలేని చంద్రబాబుకు.. కీలకమైన విజయవాడలో పార్టీ నేతల్లో విబేధాలు మింగుడుపడటం లేదు. ఇందుకు వేదిక కల్పిస్తున్న అంశం.. మున్సిపల్ ఎన్నికలు.
Vijayawada టీడీపీలో కుమ్ములాటలు..
పార్టీ అన్నాక గ్రూపు రాజకీయాలు, నాయకుల్లో ఆధిపత్యం ఉండటం సహజం. అయితే.. అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ గాలి తుంపర్లలా కొట్టుకుపోతూంటాయి. పార్టీ అధికారంలో లేనప్పుడే తుఫానుగా మారి అల్లకల్లోలం సృష్టిస్తాయి. ప్రస్తుతం ఏపీలోని టీడీపీ పరిస్థితి ఇదే. ముఖ్యంగా.. ఉమ్మడి ఏపీతో సహా ఇప్పుడు కూడా రాజకీయానికి కేంద్ర బిందువైన విజయవాడలో టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. గతంలో ట్వీట్ల ద్వారా ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మధ్య నడచిన పోరు.. ఇప్పుడు పత్రికలకు, టీవీలకు ఎక్కుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో తన కుమార్తె ‘కేశినేని శ్వేత’ టీడీపీ అభ్యర్ధి అని అనధికారికంగా ప్రకటించుకున్న కేశినేని నానిపై బుద్ధా వెంకన్న గుర్రుగా ఉన్నారు. ఆయనే కాదు.. బొండా ఉమ, జలీల్ ఖాన్, నాగుల్ మీరా, వంగవీటి రాధ కూడా కేశినేని నాని తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. వీరికి దేవినేని ఉమ మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడిదే పంచాయతీని లోకేశ్ వద్దకు తీసుకెళ్లారు. పార్టీ ప్రకటించకుండా మేయర్ అభ్యర్ధని తన కుమార్తె అని కేశినేని నాని ఎలా చెప్తారు? అనేది వీరి వాదన. ఇవేమీ పట్టని నాని తన కార్యాలయంపై ఏకంగా బ్యానరే కట్టేశారు.
చంద్రబాబుకు మరో తలనొప్పి..
ఇప్పుడీ పంచాయతీ చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారింది. పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడమెలా అని తల పట్టుకుంటున్న చంద్రబాబుకు కీలకమైన విజయవాడలో ఈ పోరు మనశ్శాంతిని ఇవ్వడం లేదు. దీనిపై నాని, వెంకన్నను మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిపించి మాట్లాడినట్టు తెలుస్తోంది. ఎంపీగా ఉంటూనే పశ్చిమ నియోజకవర్గానికి ఇంచార్జిగా ఉండటంలో తప్పు లేదని.. తూర్పు, సెంట్రల్, పశ్చిమ అనే తేడా లేకుండా నాని ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారని అధినేత ముందు ఏకరువు పెట్టినట్టు తెలుస్తోంది. కేశినేని శ్వేతను అభ్యర్ధిగా ప్రకటించుకుని ప్రచారం కూడా ఎలా చేసుకుంటారని వీరు చంద్రబాబు వద్ద ప్రస్తావించారని అంటున్నారు. జనరల్ కేటగిరీకి కేటాయించిన మేయర్ స్థానంపై పార్టీ నిర్ణయం తీసుకోవాలి కానీ కేశినేని నాని కాదని వెంకన్న వర్గం వాదిస్తోంది. అయితే.. తన కుమార్తెకు మేయర్ సీటుపై గతంలోనే పార్టీ నుంచి నాని అంగీకారం పొందారనే వాదన ఉంది. ఇది కాకుండా ఎక్కడో మైలవరంలో ఉన్న దేవినేని విజయవాడ రాజకీయాల్లో తల దూర్చడమేంటనే వాదనా తెరపైకి తెస్తున్నారు.
గతం నుంచీ ఉన్నాయా..?
మొత్తంగా ఈ అంతర్గత కుమ్ములాటలు చంద్రబాబుకు రుచించనివి. అధికారంలో ఉన్నప్పటి నుంచీ వీరి మధ్య సయోధ్య కుదర్చలేక పోయారు. అప్పుడంటే జరిగిపోయింది కానీ.. ఇప్పుడు పార్టీ ప్రాభవం కోసం పాకులాడుతున్న వేళ ఈ అంశం హైలైట్ అవుతోంది. అమరావతి అంశం, తమ హయాంలో విజయవాడ అభివృద్ది మున్సిపల్ ఎన్నికల్లో లాభిస్తుందని భావిస్తున్న చంద్రబాబుకు వీరీ వర్గ పోరాటాలతో పార్టీకి నష్టం కలుగుతుందని భావిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా వెంకన్న, నాగుల్ మీరా పరిధిలోని పశ్చిమ నియోజకవర్గంలో నాని, శ్వేత అనధికారికంగా ప్రచారం చేయడం మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. కార్యకర్తలు మధ్య కూడా దూరం పెరిగిపోవడం చంద్రబాబుకు మింగుడుపడటం లేదు. కేశినేని నాని తీరు మొదటి నుంచీ వివాదాస్పదమే. నాటి మేయర్ కోనేరు శ్రీధర్ కు నాని, కార్పొరేటర్లకు వెంకన్న, నాగుల్ మీరా, గద్దె, జలీల్ ఖాన్, బొండా ఉమ.. మద్దతు ఇవ్వడంతో అప్పట్లోనే కార్పొరేషన్లో గ్రూపులు ఏర్పడ్డాయి. ఎలానూ పంచాయితీ తన వద్దకు వచ్చింది కాబట్టి చంద్రబాబు సర్దుబాటు చేస్తారని పార్టీ భావిస్తోంది. మరి.. ఏం జరుగుతుందో..!
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?