అమరావతి: రాష్ట్రంలో చిరుద్యోగులు చేస్తున్న ఆందోళనపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ట్వీట్ చేయగా వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి దానికి స్పందిస్తూ మీ రాక్షస పాలనలో ఉద్యోగులకు నిరసన తెలిపే అవకాశం ఎక్కడిచ్చారంటూ కౌంటర్ ఇచ్చారు.
‘గత 5 ఏళ్లలో చిరుద్యోగులు ఎప్పుడూ ఈ విధంగా రోడ్డెక్కలేదు. ఉన్నంతలో అందరి సంక్షేమానికి బాటలు పరిచాం. ఇప్పుడు ఈ విధంగా ఉద్యోగ భద్రతకోసం వారు పోరాటం చేయాల్సిరావడం దురదృష్టకరం. వారి పోరాటంలో తోడుగా మేమున్నామని భరోసా ఇస్తూ, తెలుగుదేశం పార్టీ తరపున సంఘీభావం తెలియజేస్తున్నాను’ అని చంద్రబాబు ట్వీట్ చేస్తూ దానికి ఉద్యోగులు ఆందోళన చేస్తున్న వీడియోను ట్యాగ్ చేశారు.
అంగన్ వాడీ చెల్లెమ్మలను గుర్రాలతో తొక్కించిన విషయం మరచిపోయారా అని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. ‘అక్రమ అరెస్టులు, బెదిరింపులు, గూండాల్లా దాడి చేసిన మీ ఎమ్మెల్యేలు ఉద్యోగుల గొంతు నొక్కడం వల్లే కదా తమరు కుర్చీ నుంచి జారిపడింది’ అని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.