Telugu desam Party: తెలుగుదేశం పార్టీ Telugu desam Party స్థాపించి 38 ఏళ్లు పూర్తయ్యాయి. రెండు దశాబ్దాలకు పైగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీగా గుర్తింపు కూడా ఉంది. ఎన్టీఆర్ హయాంలోనూ.. చంద్రబాబు హయాంలోనూ పార్టీ ఓ వెలుగు వెలిగింది. ‘తెలుగువారి ఆత్మగౌరం’ అనే నినాదంతో పుట్టిన తెలుగుదేశం దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో ఓ ప్రత్యేక స్థానం సంపాదించింది కూడా. ఇంత చరిత్ర ఉన్న పార్టీ ప్రస్తుతం ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. 2019 ఎన్నికల్లో దారుణ ఓటమి పార్టీని బాగా కుంగదీసింది. విభజనకు గురైన రాష్ట్రం, అయిదేళ్ల అధికారం, అమరావతి,.. ఇలా మూడోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తనదైన పాలన అందించినా ప్రజల నుంచి తిరస్కారమే ఎదురైంది. ఈ పరిస్థితుల్లో పార్టీపై ఓ వార్త శ్రేణులకు ఉత్సాహాన్నిస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా పార్టీలో నాయకత్వ మార్పులు చేసేందుకు పార్టీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. చాలా నియోజకవర్గాల్లో ఇంచార్జిల వ్యవస్థ లేదు.. ఉన్నా నామమాత్రమే. ఎన్నికల ముందు పరిస్థితి కూడా ఇంతే. పార్టీ నిలబడాలంటే ఇంచార్జి వ్యవస్థ కీలకం. యువతకు పెద్ద పీట వేస్తామని.. చంద్రబాబు 2004 ఎన్నికల ఓటమి నుంచీ చెప్తున్న మాటే. కానీ.. నేటికీ ఆ మాట నెరవేరలేదు. ఎందరో యువత సిద్ధంగా ఉన్నా కొందరు పాత తరం నాయకులతోనే ఇప్పటికీ టీడీపీ నడుస్తోంది. నేటి జనరేషన్ అయినా.. పార్టీ సంస్థాగత ఓటర్లే అయినా పాత తరం నాయకులతో పార్టీ వెళ్లడం నచ్చని విషయమే. పైగా.. సీఎం జగన్ ప్రభుత్వంలో అంతా కొత్తవాళ్లు.. రాజకీయంగా కొత్త తరం అని చెప్పాలి.
జగన్ దూకుడు ముందు టీడీపీ మున్ముందు నిలబడాలంటే పార్టీలో మార్పులు అత్యవసరం. అందుకే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 100 నియోజకవర్గాల్లో నాయకుల మార్పుకు సిద్ధపడిందని తెలుస్తోంది. ఎన్నికల ముందు అందరినీ కన్ఫ్యూజ్ చేయకుండా ఇప్పుడే మార్పులు చేసి ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోంది. సీనియర్లకు, కొత్తవారికి మధ్య సత్సంబంధాలు ఉండేలా ప్లాన్ చేయాలని భావిస్తోందట. టీడీపీ నియమించిన ఎన్నికల వ్యూహకర్త రాబిన్ సింగ్ ఈ ఆలోచనను పార్టీ అధినేత ముందు పెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నిర్ణయమే సరైనదని చంద్రబాబు కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి.. నిజంగానే పార్టీలో మార్పులు జరుగుతున్నాయా? లేదా? ఎటువంటి మార్పులు అనేది తెలియాల్సి ఉంది..!