విజయవాడ, జనవరి 23: ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్పై దాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) అధికారులు బుధవారం ఎన్ఐఎ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ దాడి కేసులో మొదటి ముద్దాయిగా జనిపల్లి శ్రీనివాసరావును పేర్కొన్నారు. చార్జిషీటుతో పాటు నిందితుడు శ్రీనివాసరావు విశాఖ జైల్లో రాసుకున్న 22పేజీల లేఖను కూడా కోర్టుకు అందజేశారు. తుది చార్జిషీట్ దాఖలు చేసినప్పటికీ విచారణ కొనసాగుతుందని ఎన్ఐఎ అధికారులు పేర్కొన్నారు.
విశాఖపట్నం ఎయిర్ట్ పోర్టు ఆవరణలో అక్టోబర్ 25న అక్కడి రెస్టారెంట్లో పని చేసే శ్రీనివాసరావు కోడికత్తితో దాడి చేశాడు. ఎపి ప్రభుత్వం తొలుత ఈ కేసు దర్యాప్తునకు సిట్కు అప్పగించింది. రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని వైసిపి కేంద్ర ప్రభుత్వానికి, హైకోర్టుకు పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తునకు ఎన్ఐఎకి అప్పగించింది.
ఎన్ఐఎ అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకొని ఆరు రోజుల పాటు విచారించారు. పలు కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. బుధవారం ఎన్ఐఎ కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు.