దుబ్బాక ఉప ఎన్నికల బరిలో ఇండిపెండెంట్ గా బరిలో నిలిచి ప్రదాన పార్టీ అభ్యర్థులకు ధీటుగా ప్రచార పర్వాన్ని నిర్వహిస్తున్న బిగ్ బాస్ సీజన్ 1లో కాంటెస్టెంట్ కత్తి కార్తీక పై కేసు నమోదు అయ్యింది. కార్తీక ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉండగా హైదరాబాద్ బంజరాహిల్స్ పోలీసులు ఆమెపై చీటింగ్ కేసు నమోదు చేశారు. ఓ లాండ్ సెటిల్మెంట్ కేసులో కార్తీక తో పాటు ఆమె అనుచరులు కోటి రూపాయలకుపైగా వసూలు చేశారని బాదితులు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఒక ప్రైవేటు కంపెనీకి అమిన్ పూర్ వద్ద 52 ఎకరాల భూమిని ఇప్పించేందుకు కార్తీక మధ్యవర్తిగా వ్యవహరించి తమ వద్ద సెక్యూరిటీ డిపాజిట్ గా కోటి రూపాయలు తీసుకున్నట్లు బాధితులు ఫిర్యాదు చేయడంతో కార్తీక పైనా, ఆమె అనుచరులపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దుబ్బాక ఉప ఎన్నికల బరిలో ఇండిపెండేంట్ గా ఉన్న ఆమె కేసు నమోదు కావడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
దుబ్బాక ఉప ఎన్నికలను అదికార పక్షం టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్నికల ప్రచార పర్వం కొనసాగుతున్న నేపథ్యంలోనే బీజేపీ అభ్యర్థి రఘునందరావుకు చేరవేయడానికి తీసుకువెళుతున్నట్లుగా భావిస్తున్న రూ.40లక్షలను హైదరాబాదులో పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న కత్తి కార్తీకపై చీటింగ్ కేసు నమోదు అయ్యింది. అయితే ఇప్పటి వరకూ అధికార పార్టీయే యాంటీ గవర్నమెంట్ ఓటింగ్ ప్రత్యర్థులకు పడకుండా ఉండేందుకు కత్తి కార్తీకను బరిలోకి నిలిపిందని ప్రచారం జరిగింది. ఈ ప్రచారాలను ఆమె వర్గీయులు ఖండిస్తున్నారు. తాము ప్రభుత్వానికి అనుకూలమైతే కేసు ఎందుకు నమోదు చేస్తారని అంటున్నారు. ఉప ఎన్నికల బరిలో నిలవడం వల్లనే కేసుల పేరుతో వేధిస్తున్నారనీ ఆరోపిస్తున్నారు.
కత్తి కార్తీక అలియాస్ బైరగౌని కార్తీక టీవి యాంకర్ గా, నటిగా, రిడియో జాకీగా తెలంగాణ ప్రజలకు సుపరిచితురాలు. వీ 6 ఛానల్ లో దిల్ సే కార్తీక కార్యక్రమంతో మంచి గుర్తింపు పొందింది. జూనియర్ ఎన్ టి ఆర్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ 1 లో కంటెస్టెంట్ గా తెలంగాణ యాసలో భాషతో అలరించి ప్రేక్షకుల మన్ననలు పొందింది.