(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: ఆయన పేరే క”రణం”. రణానికి కారణం. ఎక్కడుంటే అక్కడ వివాదమే. నాడు అద్దంకి, నేడు చీరాల వారికి వేదికగా మారింది. వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత నిన్న మొన్నటి వరకూ స్తబ్దుగా ఉన్న చీరాల నియోజకవర్గంలో తాజాగా కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి. తాము ప్రశాంతంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించలేని పరిస్థితి నెలకొన్నదని కొందరు ఉద్యోగులు కలెక్టర్ని ఆశ్రయించడం తాజా పరిస్థితికి అద్దం పడుతోంది. ఇటీవలే అధికార పార్టీలో చేరి…, అప్పుడే అధికారులపై బెదిరింపులకు దిగుతుండటంతో రాజకీయంగా విమర్శలతో పాటు అధికారుల నుండి తిరుగుబాటు ఎదురవుతోంది.
ఏం జరిగిందంటే…!
వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ తొమ్మిది నెలల కాలంలో నియోజకవర్గంలో సంక్షేమ కార్యక్రమాల అమలు కొంచెం మెరుగ్గానే కనిపించింది. పెద్దగా రాజకీయ వివాదాలు చోటుచేసుకోలేదు. ప్రభుత్వ పథకాల అమలు బాగానే జరుగుతూ వచ్చింది. అయితే నియోజకవర్గ ఇన్చార్జిగా అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఉండగానే ఇటీవల సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీలో చేరిన తరువాత విబేధాలు రచ్చకెక్కుతున్నాయి. తాజాగా ఎమ్మెల్యే బలరాం కుమారుడు వెంకటేష్ అధికారులపై చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేపాయి. ఇలానే కొనసాగితే తాము ఇక విధులకు హజరుకాబోమని గ్రామ కార్యదర్శులు ఏకంగా కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.
తమను ఎమ్మెల్యే కుమారుడు వెంకటేష్ చీరాలలోని వారి కార్యాలయానికి పిలిపించి తీవ్ర పదజాలంతో దూషించారని గ్రామ కార్యదర్శులు పేర్కొన్నారు. “ఈ రోజు నుండి నేను చెప్పింది చేయాల్సిందే, చేయకపోతే మీ ఇండ్ల వద్దకు వచ్చి కొట్టి అయినా పని చేయిస్తాము” అని హెచ్చరించారని వేటపాలెం మండలం కొత్తపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి షేక్ గౌస్ మొహిద్దీన్ ఆలీ, చీరాల మండలం దేవంగాపురి పంచాయతీ కార్యదర్శి కె అంజయ్యలు బుధవారం ఒంగోలులో జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. గ్రామ కార్యదర్శులు ఏకంగా కలెక్టర్ను కలిసి ఎమ్మెల్యే తనయుడిపై పిర్యాదు చేయడం నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశమైంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?